వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది?
హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణాల్లో చెప్పిన విధంగా ముందుగా ఏ పనిని ప్రారంభించాలన్నా, ఏ పూజ చేయాలన్నా, ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా ముందుగా వినాయకుణ్ని పూజించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం ఆనవాయితీ. గణేశుడు, లంబోదరుడు, వినాయకుడు... అంటూ ఇలా పలు రకాల పేర్లతో పిలవబడే బొజ్జ గణపయ్య గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వినాయకుడికి సంబంధించి అనేక రకాల సందేహాలు తొలిచేస్తుంటాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
ఏనుగు తల ఎలా వచ్చింది?
కైలాసంలో పార్వతీదేవి తన భర్త పరమ శివుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తాను స్నానం చేసి వచ్చేలోగా కాపలాగా తన శరీరానికి నలుగు పెట్టుకున్న పిండిని తీసి ఒక బాలుడి బొమ్మను చేసి ప్రాణం పోస్తుంది. తాను వచ్చేవరకు ద్వారంవద్ద కాపలాగా పెట్టి వెళుతుంది. గజాసురుడిని సంహరించి కైలాసానికి వచ్చిన శివుణ్ని ఆ బాలుడు లోపలికి నిరాకరిస్తాడు. తననే అడ్డగించినందుకు శివుడు కోపంతే ఆ బాలుడి తలను త్రిశూలంతో వేరుచేస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి శోకిస్తుంటే ఆమెను ఓదార్చి గజాసురుడి తలను తీసుకువచ్చి ఆ బాలుడికి అతికిస్తాడు. అప్పటి నుంచి ఏనుగు తల ఉండటంతో గణేషుడు అని పిలవడం ప్రారంభించారు.
మహాభారతం రాయడం
గణేశుడు మహాభారతాన్ని రాశాడు. వ్యాస మహర్షి (వేదవ్యాసుడు) చెబుతుండగా గణేష్ రాస్తుంటాడు. అయితే తాను చెప్పేటప్పుడు మధ్యలో ఆగిపోకూడదనే షరతును వ్యాసుడు విధిస్తాడు. వినాయకుడు అందుకు అంగీకరిస్తాడు. గణేషుడు మహాభారతాన్ని రాయడమే కాకుండా అందులోని ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుంటాడు. అది పూర్తి కావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే జ్ఞానానికి, విజ్ఞానానికి ప్రతీకగా లంబోదరుడు నిలిచాడు.
విఘ్నేశ్వరుడికి ఒక దంతం ఎందుకు విరిగింది?
వినాయకుడికి ఏనుగు తల ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే రెండు దంతాలకు బదులుగా ఒక దంతం విరిగి ఉంటుంది. మహాభారతం రాసేటప్పుడు అతను రాస్తున్న ఈక విరిగిపోతుంది. మధ్యలో ఆగిపోకూడదనే షరతుకు కట్టుబడిన గణేషుడు తన దంతాన్ని విరిచి రాయడం పూర్తిచేస్తాడు. మరొక కథ ప్రకారం శివుణ్ని కలవడానికి వచ్చిన పరశురాముణ్ని నిరోధించడంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడని చెబుతారు.