1200 కోట్లు ఎవరికిచ్చారు: జగన్కు గాలి, సిఎం ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన రోజు రూ.1200 కోట్లు బెంగళూరులో విత్ డ్రా చేశారని, ఆ భారీ మొత్తాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చారో, మరెవరికి ఇచ్చారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం ప్రశ్నించారు. రూ.1200 కోట్లు విత్ డ్రా అంశాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఆర్బిఐ పైన ఉందన్నారు.
ఉద్యోగులు చిన్న చిన్న కేసులలో ఎసిబికి పట్టుబడితే బెయిల్ రావడమే కష్టమని అలాంటిది లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్కు ఎలా వచ్చిందన్నారు. అధికారం, ఓట్లు, సీట్ల కోసం తప్ప మరొకటి కాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు సమైక్యాంధ్ర ఇష్టం లేదన్నారు. ఢిల్లీ పెద్దల సూచనలతోనే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయే అన్నారు.
కాళ్లు పట్టుకున్నారు: సిఎం రమేష్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతిలు ఢిల్లీ వెళ్లి అహ్మద్ పటేల్ను ఎన్నిసార్లు కలిశారో తన వద్ద ఆధారాలున్నాయని టిడిపి ఎంపి సిఎం రమేష్ అన్నారు. ఢిల్లీలో విజయమ్మ దిగగానే ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారని, ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఉద్యోగుల ఆందోళన శిబిరం వద్దకు విజయమ్మ వెళ్లారని ఆరోపించారు.
జైల్లో ఉన్న వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే నిబంధనల ప్రకారం ఆ విషయం బయటకే రాదని, సమైక్యం పేరిట జగన్ దీక్ష నాటకం కాంగ్రెసు కనుసన్నుల్లోనే సాగిందన్నారు. బెయిల్ కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని, ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.