బందరులో జనసేన సభపై భారీ అంచనాలు ? పవన్ నిర్ణయం కోసం ఆ ఇద్దరూ వెయిటింగ్ !
మచిలీపట్నంలో ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీతో పాటు విపక్షంలోని టీడీపీ, బీజేపీల భవిష్యత్తుకు సైతం కీలకంగా మారింది.
మచిలీపట్నం : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండటంతో పాటు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు మధ్యలో మోడీ రోడ్ మ్యాప్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ తర్వాత వ్యూహాలు మార్చుకున్న పవన్.. చంద్రబాబుకు ఓసారి దగ్గరవుతూ మరోసారి దూరంగా ఉంటూ అస్పష్టంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కోసం ఎదురుచూడాలా వద్దా అన్న దానిపై బీజేపీ, టీడీపీ ఇరుపార్టీలూ ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.

ఏపీలో పవన్ పాలిటిక్స్
ఏపీలో పాతికేళ్ల రాజకీయం పేరుతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. అధికారం దిశగా అడుగులు వేయడంలో విఫలమవుతున్నారు. 2014లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చినా, 2019లో ఒంటరిగా బరిలోకి దిగి భారీగా దెబ్బతిన్నా, 2024 కోసం ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపైనా అస్పష్టంగానే కనిపిస్తున్నారు. దీంతో పవన్ అడుగుల్ని, ఆయన రాజకీయాన్ని నమ్ముకున్న రెండు పార్టీలు బీజేపీ, టీడీపీ రెండూ ఇప్పుడు తలపట్టుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం మిగిలున్న తరుణంలో తమతో పొత్తు విషయంలో పవన్ ఇచ్చే స్పష్టత కోసం ఇరు పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

బందరు సభపైనే ఆశలు ?
వచ్చే ఎన్నికలకు దాదాపు ఏడాది మాత్రమే మిగిలుంది. అయినా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పొత్తు ఎవరితో పెట్టుకుంటారు, ఎన్నికల నాటికి ఎవరెవరితో కలిసి ప్రయాణం చేస్తారన్న దానిపై గందరగోళం మాత్రం కొనసాగుతూనే ఉంది. మధ్యమధ్యలో చంద్రబాబుతో భేటీ అవుతూ, ఆ తర్వాత సైలెంట్ అయిపోతూ పవన్ సాగిస్తున్న రాజకీయం ఇప్పుడు ఇరు పార్టీల్ని కలవరపెడుతోంది. ఈ తరుణంలో బందరు సభపై జనసేన కంటే ఎక్కువగా టీడీపీ, బీజేపీ ఆశలు పెట్టుకుంటున్నాయి. బందరులో పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేస్తే తమ వ్యూహాలు తాము రచించుకోవచ్చనే ఆలోచనలో ఇరు పార్టీలు కనిపిస్తున్నాయి.

పవన్ ఈసారీ కష్టమేనా ?
పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగటతానని చెబుతున్నా పొత్తుల విషయానికొచ్చేసరికి గందరగోళం మాత్రం కొనసాగుతోంది. ఇదే పరిస్ధితి మరికొన్నాళ్లు కొనసాగితే అంతిమంగా విపక్షాలన్నీ నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బందరులో పవన్ కళ్యాణ్.. పొత్తులపై ప్రకటన చేస్తారని టీడీపీ, బీజేపీ భావిస్తున్నా.. అది అసాధ్యంగానే కనిపిస్తోంది. పొత్తుల గురించి మాట్లాడినా పూర్తిస్పష్టత ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. గతంలోనూ చంద్రబాబుతో భేటీలు, బీజేపీ పెద్దలతో మీటింగ్స్ పెట్టినా ఎన్నికల నాటికి కొనసాగే పొత్తులపై పూర్తి స్పష్టత ఇవ్వని పవన్.. మరోసారి బందరులోనూ ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం కారణంగానే జనసేన గ్రాఫ్ పడిపోతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో.. పొత్తులపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని టీడీపీ, బీజేపీయే కాదు జనసేన నేతల నుంచీ డిమాండ్లు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications