విపక్షాలకు మోడీ వైజాగ్ టూర్ పరీక్ష-వైసీపీ ప్లాన్ క్లియర్ ! టీడీపీ అవుట్ ! జనసేనను వదిలేస్తే బీజేపీ !
ప్రధాని మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దీని ప్రకారం ఈ నెల 11 సాయంత్రం 7.25కు ఆయన విశాఖ చేరుకుంటారు. అనంతరం విశ్రాంతి తీసుకుని 12న విశాఖలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు విపక్షాలను దూరంగా ఉంచేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
విశాఖలో మోడీ టూర్
విశాఖపట్నంలో పలు అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేసేందుకు ప్రధాని మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో ఏపీకి రానున్నారు. ఈ టూర్ రాష్ట్రంలో అధికార వైసీపీకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇన్నాళ్లూ ప్రధాని మోడీకి, కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నా అటు నుంచి ఎలాంటి సహకారం లేదనే విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని రాష్ట్రానికి రప్పించేందుకు వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అదీ కాక కార్యనిర్వాహక రాజధానిగా తెరపైకి తెచ్చిన విశాఖకు ప్రధానిని రప్పిస్తే కొత్త రాజధానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర పడినట్లు ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విపక్షాలకు ఈ టూర్ లో చోటు దక్కేలా లేదు.
వైసీపీ గేమ్ ప్లాన్ ఇదే !
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో విభేదిస్తున్న విపక్షాలను ప్రధాని మోడీ టూర్ కు దూరంగా ఉంచాలని జగన్ నిర్ణయించారు. గతంలో ప్రధాని మోడీ భీమవరం టూర్ కు విపక్షాలకు ఏకంగా ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందినా వారిని రాకుండా విజయవంతంగా అడ్డుకున్న సర్కార్.. ఈసారి అధికారిక టూర్ పేరుతో వారిని అడ్డుకునేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రధాని మోడీ టూర్ పూర్తిగా అధికారికమని, దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ టూర్ పై వైసీపీ ఎంత క్లారిటీగా ఉందో అర్దమవుతుంది.
బీజేపీకి అవకాశం ఉంటుందా ?
రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీతో నిత్యం విభేదిస్తున్న బీజేపీ నేతలకు ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనే అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ టూర్ అధికారికమని ప్రభుత్వమే చెబుతుండగా.. మోడీ టూర్ ను హైజాక్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే వైసీపీ ప్రభుత్వానికి పోటీగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మోడీ టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. అలాగే మోడీ టూర్ లో తమకు అవకాశం దక్కేలా కేంద్రం స్దాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, స్వయంగా ప్రధాని మోడీ సొంత పార్టీ కావడంతో బీజేపీ నేతలకు ఈ టూర్ లో పాల్గొనే ఛాన్స్ దక్కొచ్చని భావిస్తున్నారు.
టీడీపీ-జనసేన మళ్లీ దూరం ?
కానీ టీడీపీకి కానీ, బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు కానీ ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనే అవకాశం దక్కకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అధికారిక టూర్ అని ముందే చెప్పేసిన వైసీపీ.. గతంలో భీమవరం టూర్ తరహాలోనే మిగతా పార్టీలను,నేతలను దీనికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని ముందే ఊహించిన చంద్రబాబు, పవన్ ఈ టూర్ కు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆహ్వానం లేకుండా అక్కడికి ఎలాగో వెళ్లరు. చివరి నిమిషంలో ఆహ్వానం పంపినా వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో వరుసగా రెండో సారి ప్రధాని మోడీ టూర్ కు చంద్రబాబు, పవన్ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.