'ఇళ్లలో దొంగతనం చేయడం ఎలా?': పుస్తకం రాసిన దొంగ
విశాఖపట్నం: 64 కళల్లో దొంగతనం కూడా ఒక కళ. ప్రస్తుత సమాజంలో అన్ని కళలకు స్కూల్స్తో పాటు వాటిని నేర్పే గురువు, పుస్తకాలు ఉన్నాయి. కానీ దొంగతనానికి మాత్రం అలాంటి సదుపాయం లేదు. ఈ లోటును పూరించాలని భావించాడో ఏమో కానీ విశాఖలో పట్టుబడిన ఓ దొంగ ఇళ్లలో దొంగతనం చేయడం ఏలా? అనే పుస్తకాన్ని రచించాడు.
ఏపీతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో స్నేహితుడు నరేష్తో కలసి పలు దొంగతనాలు చేసిన తిరుపతిరావును గురువారం విశాఖ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 144 గ్రాముల బంగారం, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నరేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతిరావు రాసిన 'ఇళ్లలో దొంగతనం చేయడం ఎలా?' అనే పుస్తకాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకాన్ని కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం ఏడీసీపీ వరదరాజులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గంగాడకు చెందిన తిరుపతిరావు (27) ఇంటర్ వరకూ చదివి మానేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన తిరుపతిరావు 2009లో విశాఖకు వచ్చి కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని తస్కరించాడు.
తర్వాత మల్కాపురానికి చెందిన ఒక కాంట్రాక్టర్ వద్ద కారు డ్రైవర్గా చేరి డబ్బు కోసం ఆ కాంట్రాక్టర్ను హత్య చేశాడు. దీంతో మల్కాపురం పోలీసులు 2011లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒడిశా, విజయనగరం జిల్లా బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా రాజాం, శ్రీకాకులం పట్టణాల్లో ఇళ్ల చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడటంతో శ్రీకాకుళం జైలుకు తరలించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత 2014లో విశాఖ వచ్చి చిన వాల్తేరు, రామ్ నగర్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉంటూ నగర పరిధిలో తొమ్మిది చోరీలు, మూడు బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్ట చేసి జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్ 30న కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు.
ఈ సమయంలో జైలులో నరేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ వ్యసనాల కోసం డబ్బు అవసరం కావడంతో తిరిగి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది మార్తి 15న ఎంవీపీ కాలనీలోని ఏయూ క్వార్టర్స్లో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి 915.25 గ్రాముల బంగారం, రూ. 1.6 లక్షల నగదు, కిలోన్నర వెండి వస్తువులను దొంగలించారు. ఆ తర్వాత రెండు ద్విచక్ర వాహనాలను అపహరించుకుపోయారు.
చోరీచేసిన వస్తువులను తిరుపతిరావు కురాపం మార్కెట్ వద్ద విక్రయిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో సోత్తుతో సహా అదుపులోకి తీసుకున్నారు. తిరపుతిరావును విచారించగా ఫైన పేర్కొ్న నేరాలన్నింటినీ అంగీకరించాడు.
పోలీసుల చేతికి డైరీ:
తిరుపతిరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని గదిలో సోదాలు చేయగా ఒక పుస్తకం లభ్యమైంది. 15 పేజులు ఉన్న ఆ పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. 'దొంగతనం చేయడం ఎలా నేరమవుతుంది? ఒకవేల నేరమే అయితే దేవుడు పేదవాడిని పుట్టించడం నేరమే కదా?
పేదవాడు ఎప్పుడూ డబ్బున్న వాడిని దోచుకోవచ్చు? దాని వల్ల పేదవాడికి కడుపు నిండుతుంది. అంతేకానీ డబ్బున్న వాడికి ఎలాంటి నష్టం జరగదు'. అని రాసుకున్నాడు. అలాగే దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో లారీలు, ప్రొక్లెయిన్లుతో పాటు స్వగ్రామంలో భూములను కొనుక్కొని అందరి దగ్గర గొప్పగా ఉండే స్థాయికి చేరుకోవాలనేది తన జీవిత లక్ష్యంగా రాసుకున్నాడు.
వీటితో పాటు ఆ పుస్తకంలో పోలీస్, జ్యుడీషియల్ హైరార్కీ రాసి ఉంది. దొంగతనాలు ఎలా చేయాలి? ఎలా చేస్తే ఆధారాలు లభ్యం కాకుండా ఉంటాయి. వంటి వివరాలను రాసుకోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.