బాబు సరదా వ్యాఖ్యలు: చేతులు కాలాక... టిడిపి నేతలిలా..
తాము వేయించిన రోడ్లు, తాము నిర్మించిన ఇళ్ళలో ఉంటూ తమకు ఓటు వేయరా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో చోటుచేసుకొన్న పరిణామాలతో నష్టనివారణ చర్యలకు చేపట్టింది
నంద్యాల: తాము వేయించిన రోడ్లు, తాము నిర్మించిన ఇళ్ళలో ఉంటూ తమకు ఓటు వేయరా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో చోటుచేసుకొన్న పరిణామాలతో నష్టనివారణ చర్యలకు చేపట్టింది తెలుగుదేశం. అయితే జరగాల్సిన నష్టం జరిగిందనేది టిడిపి నేతల అభిప్రాయంగా ఉంది.
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
నంద్యాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మహిళలతో ఆయన మాట్లాడుతూ టిడిపికి ఓటు వేయకుండా తాము వేయించిన రోడ్లపై ఎలా నడుస్తారు, ఎలా తాము నిర్మించిన ఇళ్ళలో నివసిస్తారనే విషయమై బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఈ వ్యాఖ్యలను ప్రధాన విపక్షం వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ప్రకటనలపై జాతీయ మీడియాలో కూడ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలపై చోటుచేసుకొన్న విమర్శలపై టిడిపి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బాబు ఏమన్నారంటే
నంద్యాల పర్యటనకు వెళ్ళిన సమయంలో చంద్రబాబునాయుడు సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచాయి. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను వినియోగించుకొంటూ తమ పార్టీకి ఓటు వేయరా అంటూ ఆయన చమత్కరించారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహరం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో తప్పుడు సంకేతాలు వెళ్ళాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
Recommended Video
జాతీయ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ
చంద్రబాబునాయుడు చేసిన ఈ ప్రకటనలపై సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో కూడ విస్తృతంగా చర్చ సాగింది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కూడ ఈ తరహ ప్రచారాన్ని తప్పుబట్టారు.
జాతీయ మీడియాలో చర్చకు వైసీపీ
జాతీయ మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం కావడానికి ప్రతిపక్ష పార్టీయే కారణమనే అభిప్రాయాన్ని కొందరు టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకొందని టిడిపి నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.
అంతా అయిపోయాక
జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పుడు టిడిపి నేతలు నష్టనివారణ చర్యలను ప్రారంభించారు. అసలు ఏం జరిగిందో, ఏ సందర్భంలో , ఎలా చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారనే విషయమై టిడిపి నేతలు వివరణ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.సరైన సమయంలో స్పందించి ఉంటే ప్రయోజనంగా ఉండేదనే అభిప్రాయాన్ని కొందరు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.