'వైయస్ విగ్రహాన్నే జగన్ రక్షించుకోలేకపోయారు, ఇది వైసీపీ నుంచి వచ్చి ఇదే చెప్తున్నారు '
విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగిస్తుంటే కాపాడుకోలేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక పేద ప్రజలకు ఎలా సాయం చేస్తారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం నాడు ఎద్దేవా చేశారు.
తమ పార్టీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నారా లోకేష్ ఎదుగుతుంటే మీకు బాధ ఎందుకని ప్రశ్నించారు. వ్యక్తిత్వాలను కించపరిచే విమర్శలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారా లోకేష్ ఎదురుతిరగలేదన్నారు. అలాగే, టీడీపీ సీనియర్లను ఆయన గౌరవిస్తారని చెప్పారు. జగన్కు కలుపుకొని వెళ్లే మనసత్త్వం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే చెబుతున్నారన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోకూడదని జగన్కు విజ్ఞప్తి చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జనరల్ సెక్రటరీ హోదాలో నారా లోకేష్ పార్టీ పరిస్థితిని సమీక్షించడాన్ని వైసిపి నేతలు వక్రీకరించారన్నారు. వైయస్ హయాంలో జగన్ ఏ అధికారంతో సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారో చెప్పాలన్నారు.