ట్రాజెడీపై చిరంజీవి, కవితలు: మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, నిజామాబాద్ తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితలు సోమవారం స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ను లక్షలాది మంది పర్యాటకులు చూసేందుకు వస్తారని, ఇలాంటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని చిరంజీవి హితవు పలికారు.
హిమాచల్ ప్రదేశ్ ఘటన తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
ప్రమాద ఘటనను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. డ్యామ్ అధికారులు నీటిని విడుదల చేసేటప్పుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని ప్రాజెక్టు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి 16వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మరో మృతదేహం లభ్యం
గాలింపు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం దేవాశిష్ బోస్గా తెలుస్తోంది. మిగతా విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, హిమాచల్ప్రదేశ్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆఘమేఘాలపై స్పందించాయి. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి నారాయణ ఘటనాస్థలంలోనే మకాం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్, సింగ్, అశోక గజపతిరాజు, కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ హిమాచల్ ప్రదేశ్ సిఎం వీరభద్రసింగ్, తదితరులతో ఫోన్లో మాట్లాడారు.
సహాయక చర్యల తీవ్రతను పెంచాలని ప్రధాన మంత్రి కార్యాలయంపై కూడా బాబు ఒత్తిడి పెంచారు. మంత్రి అశోక గజపతిరాజు తెల్లవారుజామున మూడు గంటలకు, మధ్యాహ్నం కల్లా హిమాచల్ సీఎం వీరభద్ర సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టిడిపి ఎంపీ మల్లారెడ్డి కూడా సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కెసిఆర్ పర్యవేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సంఘటన స్థలం వద్దే ఉన్నారు.
మరోవైపు టిడిపి.. ఎయిర్కోస్టాకు చెందిన ఓ విమానాన్ని చండీగఢ్కు పంపించింది. ఈ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర మంత్రి నారాయణకు అప్పగించారు. ఆయన అధికారులతో కలిసి హిమచల్ ప్రదేశ్కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్శర్మ ఇద్దరూ సోమవారం భేటీ అయ్యారు. హిమాచల్ప్రదేశ్ దుర్ఘటనపై రెండు ప్రభుత్వాలు కలసి కట్టుగా చర్యలు చేపట్టాలనుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications