పవన్ జనసేనకు పెరిగిన డిమాండ్-టీడీపీ, బీజేపీ పోటా పోటీ-అసలు మైండ్ గేమ్ ఎవరిది ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువున్నా ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో కలిసి ప్రయాణిస్తే 2024 ఎన్నికల్ని గెల్చుకోవచ్చు, ఇప్పటినుంచే పొత్తులు పెట్టుకుంటే ప్రత్యర్ధుల కంటే ముందడుగు వేసే అవకాశముంటుందని భావిస్తున్న విపక్షాలు.. అందుకు తగ్గట్టుగానే ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చంద్రబాబు,పవన్, సోము వ్యాఖ్యలు ఉన్నాయి.

ఏపీలో పొత్తుల వేడి
ఏపీలో ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు గడువు ఉండగానే పొత్తుల చర్చలు వాడీవేడిగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా గతంలో బీజేపీ కోసం జనసేన, టీడీపీ పోటీ పడగా.. ఇప్పుడు జనసేన కోసం బీజేపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. దీంతో ఆయా పార్టీల అధినేతల మైండ్ గేమ్ మొదలైపోయింది. దీంతో ఆ మైండ్ గేమ్ పైనా మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు తమ పార్టీ కోసం చేస్తున్న ప్రయత్నాలతో అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ లో పావులు కావొద్దంటూ తన పార్టీ కార్యకర్తలకు సూచిస్తుండగా..ఏపీలో ఏ మైండ్ గేమ్ నైనా అడ్డుకుంటామని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

జనసేనకు పెరిగిన పోటీ
ఏపీలో ప్రస్తుతం తాజాగా రాజకీయాలు జనసేన చుట్టూ తిరిగే పరిస్దితి వచ్చేసింది. గతంలో జనసేనను లైట్ తీసుకున్న టీడీపీ, బీజేపీ ఇప్పుడు జనసేన గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ జనసేన అధికార వైసీపీని వదిలి వైజాగ్ స్టీల్ విషయంలో తమపై పోరాటం చేస్తున్నా కిమ్మనని బీజేపీ నేతలు.. ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ జనసేనను లవ్ చేస్తున్నానంటూ చంద్రబాబు కామెంట్స్ చేయగానే వెంటనే రంగంలోకి దిగిపోయారు. అంతే కాదు ఎవరి మైండ్ గేమ్ లోనూ పడొద్దంటూ తన కార్యకర్తల్ని పవన్ అప్రమత్తం చేస్తుంటే దాన్ని సమర్ధిస్తూ సోము వీర్రాజు ప్రకటనలు చేసేస్తున్నారు. దీంతో చంద్రబాబు మైండ్ గేమ్ కు పవనే కాదు తాము కూడా వ్యతిరేకమంటూ చెప్పుకునేందుకు సోము శ్రమిస్తున్నారు.

చంద్రబాబు ప్రకటన వెనుక ?
పవన్ కళ్యాణ్ జనసేనతో పోలిస్తే బీజేపీతో పొత్తు కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు.. తాజాగా రూటు మార్చారు. క్షేత్రస్ధాయిలో మారుతున్న పరిస్ధితులు.. స్ధానికంగా పొత్తులు పెట్టుకుని టీడీపీ-జనసేన సాధిస్తున్న విజయాలు చంద్రబాబు మనసుమార్చుకునేలా చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు క్షేత్రస్ధాయిలో పర్యటనల సందర్భంగా జనసేనతో పొత్తును టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ముందే ప్రస్తావిస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా వారి మాటలకు స్పందిస్తూ తాను లవ్ చేస్తున్నా.. జనసేన నుంచి రెస్పాన్స్ లేదని బహిరంగంగానే ఒప్పేసుకున్నారు. దీంతో చంద్రబాబు జనసేన కోసం పడుతున్న పాట్లు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.

పవన్ ప్లాన్ మాత్రం ఇదే ?
ఓవైపు చంద్రబాబు, మరోవైపు బీజేపీ తన కోసం అర్రులు చాస్తున్నా పవన్ మాత్రం లౌక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీని వీడి టీడీపీతో కలిసినా పవన్ కు కానీ, ఆయన పార్టీ జనసేనకు కానీ వచ్చే లాభం ఏమీ లేదు. అనవసరంగా బీజేపీని వీడి విమర్శలపాలవ్వడం మినహా చేయగలిగిందేమీ లేదు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు ప్రారంభించినా అందులో బీజేపీని ఒక్కమాట కూడా అనడం లేదు. రేపు పరిస్దితులు మారిపోతే అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పోరును వాడుకోవచ్చని పవన్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ రంగంలోకి దిగి ఇద్దరినీ గతంలోలాగే బదనాం చేసే ప్రమాదం ఉందని పవన్ అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో జత కడితే ప్రయోజనం ఉంటుందనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications