నోట్ల రద్దుతో ఏపీ ఎక్సైజ్ శాఖకు రూ.200 కోట్లు గండి: మంత్రి, రవాణా శాఖకూ..
నోట్ల రద్దు కారణంగా తమ శాఖలకు భారీ నష్టం వాటల్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, శిద్ధా రాఘవ రావులు వేర్వేరుగా చెప్పారు.
అమరావతి: నోట్ల రద్దు కారణంగా తమ శాఖలకు భారీ నష్టం వాటల్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, శిద్ధా రాఘవ రావులు వేర్వేరుగా చెప్పారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ప్రజలు నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం స్పందించారు.
మోడీ నిర్ణయం తర్వాత ఏపీలో రూ.200 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిందని కొల్లు చెప్పారు. మద్యం దుకాణాల్లో పోస్ యంత్రాలు వాడాలన్నారు. ఇప్పటికే ఇరవై శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయన్నారు.
హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను 500మీ.ల దూరంలో ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా కొత్త బార్ విధానం తీసుకు వస్తామన్నారు. వెనుకబడిన తరగతుల్లో వివిధ సమాఖ్యలకు రూ.354 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.
ఆర్టీసీకి నష్టం
నోట్ల రద్దుతో రవాణా శాఖకు 10 కోట్లు, ఆర్టీసీకి రూ.45 కోట్ల నష్టం వచ్చిందని మంత్రి శిద్దా రాఘవ రావు వెల్లడించారు. నష్టాలు మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణాశాఖలో 160 ఈ పోస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్టీసీలో దశల వారీగా పోస్ మిషన్లను తీసుకొస్తామన్నారు.