నువ్వా -నేనా : ముగిసిన నామినేషన్ల పర్వం : హీటెక్కుతున్న ఏపీ రాజకీయం..!!
ఏపీలో మరోసారి రాజకీయం హీటెక్కుతోంది. పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచే ఆరోపణలు..ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇక, ఈరోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజున నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయినట్లుగా జిల్లాల నుంచి సమాచారం అందుతోంది. నెల్లూరు కార్పొరేషన్తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ముగిసిన నామనేషన్ల గడువు
అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ గా నిర్ణయించారు. అదే విధంగా.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా వెల్లడించారు.

పొత్తులు..ఫిర్యాదులు..లేఖలు
పరిషత్ ఎన్నికలు: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 9గా నిర్దారించారు. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. ఇక, నెల్లూరు లాంటి నగరాల్లో టీడీపీ -సీపీఎం మధ్య, అదే విధంగా బీజేపీ - జనసేన మధ్య పొత్తుల పంచాయితీ చివరి నిమిషం వరకు తేలలేదు. జనసేన దాదాపుగా 40 సీట్లలో తామే పోటీ చేస్తామంటూ పట్టుబట్టింది.

అధికార పార్టీపై టీడీపీ అధినేత లేఖలు
దీంతో..నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో ముందుగా ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసారు. ఇక, ఇప్పుడు పొత్తులు - పోటీ చేసే స్థానాల పైన తుది నిర్ణయానికి వచ్చి..అభ్యర్ధులు కాని వారిని పోటీ నుంచి ఉపసంహరణ కోసం బుజ్జగింపుల పర్వం ప్రారంభం కానుంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పోటీలో ఉన్న అభ్యర్ధి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైసీపీ నేతలు అడ్డుకొని దాడికి దిగారంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. టీడీపీ అభ్యర్ధులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.
Recommended Video

కుప్పం..నెల్లూరు పైనే ప్రధాన ఆసక్తి
వైసీపీ అప్పుడే కుప్పంలో ప్రచారం ప్రారంభించింది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో గెలుపు బాధ్యలను తన భుజస్కందాల పైన వేసుకున్నారు. అదే విధంగా నెల్లూరు నగరంలోనూ పోటీ రసవత్తరంగా మారుతోంది. దీంతో పాటుగా పల్నాడు లోని రెండు మున్సిపాల్టీల ఎన్నికల పైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు స్థానిక ఎమ్మెల్యే లు..నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల సంఘం వస్తున్న ఆరోపణలు..ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం సిద్దం చేసారు. అయితే, ఎన్నికల్లో దౌర్జన్యాలకు దిగితే ఎన్నికల సంఘం అడ్డుకోవాలని..అవసరమైతే తానే ఎన్నికల సంఘానికి వస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో..ఇక, ప్రచార పర్వంలో రాజకీయంగా వాతావరణం మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications