చంద్రబాబు ఖాతాలో మరో స్టే: సీఐడీ విచారణకు వెళ్లనక్కర్లేదు: ఇదే కేసులో నారాయణకు ఊరట..!
అమరావతి: అమరావతి భూముల కుంభకోణంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో నోటీసులను అందుకున్న మున్సిపల్ శాఖ మాజీమంత్రి పీ నారాయణకు కూడా ఊరట కల్పించింది. ఫలితంగా- ఈ నెల 23వ తేదీ నాటి సీఐడీ అధికారుల విచారణకు చంద్రబాబు, నారాయణ హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
వైఎస్ జగన్ జీతం ఒక్కరూపాయే: ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం రూ. లక్షల్లో: ఎంత కట్టారో తెలుసా?
అమరావతిలో దళితులకు కేటాయించిన 500 ఎకరాల అసైన్డ్ భూములను కొందరు వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేశారని, వారికి చంద్రబాబు ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులను జారీ చేసిందంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ సత్యనారాయణపురంలోని ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ మూడు రోజుల కిందటే నోటీసులు అందజేశారు.
ఈ నోటీసులపై చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం నాడు క్వాష్ పిటీషన్లు దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవంటూ పిటీషన్లలో పేర్కొన్నారు. ఈ పిటీషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కొద్దిసేపటి కిందటే విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దొమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు.
చంద్రబాబుపై ఇండియన్ పీనల్ కోడ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన 120 బీ, 166, 167, 217, 34, 35, 36, 37 కేసులు.. దీనికి వర్తించబోవని, సంబంధం లేని కేసులను నమోదు చేశారంటూ చంద్రబాబు, నారాయణ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఐడీ తరపున న్యాయవాది నాగభూషణం వాదనలు వినిపించారు. అయితే వాదనలను విన్న ధర్మాసనం చంద్రబాబుకు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. స్నష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని కోరింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫిర్యాదు చేయాల్సింది ఎవరు.. బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించింది. దీనికి విచారణ తొలి దశలో ఉన్నందున వివరాలు చెప్పలేమని సీఐడీ తన వాదనలను వినిపించింది. పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని సీఐడీ ధర్మాసనంను కోరింది.
ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే ఇచ్చింది. ఫలితంగా- ఈ నెల 23వ తేదీ నాటి సీఐడీ విచారణకు చంద్రబాబు గానీ, నారాయణ గానీ హాజరు కారు.