ఆంధ్రాలో తెలంగాణ మద్యం అమ్మకాల జోరు.. కృష్ణాజిల్లాలో ఐదు రోజుల్లో 143 కేసులు...
ఏపీలో మద్యనియంత్రణలో భాగంగా అమ్మకాలను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుమసరిస్తున్న విధానం అక్రమార్కుల పాలిట వరంగా మారుతోంది. ముఖ్యంగా తాజాగా భారీగా పెరిగిన ధరలతో అల్లాడుతున్న ఏపీ మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు తెలంగాణకు చెందిన కొందరు అక్కడి మద్యాన్ని భారీఎత్తున తరలించి సరిహద్దు జిల్లాల్లో అమ్ముకుంటున్నారు. దీంతో నాణ్యమైన బ్రాండ్లను బ్లాక్ అయినా కొని సేవించేందుకు ఇక్కడి మద్యం ప్రియులు ఎగబడుతున్నారు.
మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీలో మద్యం దుకాణాలు తెరిచిన ప్రభుత్వం ధరలను 75 శాతం పెంచింది. అయినా విక్రయాలు మరింత పెరిగాయి. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు ఎగబడ్డారు. చివరికి అక్కడ తక్కువ ధరకే దొరుకుతున్న మద్యం బాటిళ్లను తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఏపీలోని కృష్ణా, గుంటూరుకు తరలించడం మొదలుపెట్టారు. అక్రమంగా వేల కొద్దీ మద్యం బాటిల్స్ కేస్ లను ఇక్కడికి తరలించి అమ్ముకుంటున్నారు. దీంతో తక్కువ ధరకే వారికి క్వాలిటీ బ్రాండ్స్ దొరుకుతున్నట్లయింది.
ఏపీలో ప్రస్తుతం దొరుతుతున్న మద్యం ధరలను ఓసారి తెలంగాణతో పోల్చి చూస్తే క్వార్టర్ బాటిల్ ధర ఏపీలో 350 అయితే తెలంగాణలో 160 మాత్రమే. అంటే 190 రూపాయల వ్యత్యాసం అన్నమాట. దీంతో ఎంచక్కా తెలంగాణలో కొన్న మద్యాన్ని ఇక్కడికి తెచ్చి అమ్మేసుకుంటున్నారు. గత ఐదు రోజుల్లో కృష్ణాజిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి అక్రమాలపైనే 143 కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలోనూ దాదాపు ఇదే స్దాయిలో కేసులు నమోదవుతున్నాయి.