ఆ జీవోపై చంద్రబాబు సంతకం: ల్యాండ్ పూలింగ్..భారీ కుంభకోణం: తప్పు చేయకపోతే స్టే ఎందుకు: సజ్జల
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూసమీకరణ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని అన్నారు. ఈ కుంభకోణంలో చాలామంది ప్రముఖులు ఉన్నారని, వారందరూ సిండికేట్గా ఏర్పడి పేదల భూములను కూడా కొల్లగొట్టారని విమర్శించారు. పేదలను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కున్నారని అన్నారు.
రెడీ టు వర్క్: జగన్ సొంత జిల్లాలో ఈఎంసీ: ప్రారంభానికి ముహూర్తం ఖరారు?: 30 వేల జాబ్స్
శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, తన బినామీలకు లబ్ధి కలిగించడానికే జీవో 41ను తెచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రమేయం ఉందా? లేదా? అనడానికి ఈ జీవో సాక్ష్యమని చెప్పారు. రాజధాని ఫలాని చోట వస్తుందని చంద్రబాబు తన బినామీలకు ముందే లీకులు ఇచ్చి.. తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేయించారని సజ్జల అన్నారు. చంద్రబాబు నిజంగా అక్రమాలకు పాల్పడి ఉండకపోతే ధైర్యంగా ఎందుకు విచారణను ఎదుర్కొనట్లేదని ప్రశ్నించారు. స్టే ఎందుకు తెచ్చుకున్నారని నిలదీశారు.
దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని, వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారాన్ని చెల్లించ లేదని అన్నారు. భూసమీకరణ పూర్తయిన తరువాతే చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ చట్టం తీసుకొచ్చిందని, ఇలా అసైన్డ్ భూములు తీసుకున్న వారికి లాభం కలిగేలా జీవో నంబర్ 41 తీసుకువచ్చారని సజ్జల అన్నారు. సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ సంతకం కూడా ఈ జీవోలో ఉందని స్పష్టం చేశారు. పేదల భూములను చౌకగా తీసుకొని అగ్రిమెంట్లు చేసుకున్న అనంతరం జీవోతో చట్టం చేసుకున్నారుని, దీనిపైనే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆయన గుర్తు చేశారు.
అమరావతి పేరుతో లక్ష కోట్ల కుంభకోణానికి చంద్రబాబు ప్రధాన కారకుడని సజ్జల ఆరోపించారు. దీనిపై విచారణ కొనసాగి తీరుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపడుతోందని అన్నారు. సీఐడీ ఎవరి నుంచి సాక్ష్యాలు తీసుకుందో ఆ వీడియోలతో సహా బయటకు వస్తాయని వివరించారు. గతంలో సీఆర్డీఏకు చంద్రబాబు చైర్మన్గా ఉన్నారనే విషయాన్ని ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. 2016 ఫిబ్రవరిలో చట్టాన్ని సవరించడానికి కారణలేమిటో చంద్రబాబు వివరించక తప్పదని సజ్జల అన్నారు.