2016 రివైండ్: చంద్రబాబు 'కొత్త' ఆలోచన, రాజధానిపై అడ్డంకి
2016 రివైండ్: చంద్రబాబు 'కొత్త' ఆలోచన, రాజధానిపై అడ్డంకి
అమరావతి: 2016లో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడమే. ఆయన రాకతో అప్పుడే 2019 ఎన్నికలలో గెలుపెవరిది? ఆయన ఎవరితో కలుస్తారు? జగన్-చంద్రబాబులలో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ సాగుతోంది.
అంతకుముందు రెండేళ్లు ఏపీలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే రాజకీయ వేడి కనిపించింది. అంతకుముందు అప్పుడప్పుడు సమస్యల పైన స్పందించిన పవన్.. 2016 రెండో అర్ధభాగంలో రంగంలోకి దిగారు.
ప్రత్యేక హోదా నుంచి మొదలు నోట్ల రద్దు అంశం వరకు ఆయన స్పందించారు. హోదా పైన ఆయన జిల్లాల్లో వరుసగా సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. 2017 జనవరి నుంచి మిగతా జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు.
అంతకుముందు ఏడాదులలో రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా పైన స్పందించారు. అప్పటికప్పుడు ఆ వేడి రాజుకొని, చల్లారింది. ఇప్పుడు ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఏపీలో రాజకీయం మూడు ముక్కలాటగా మారింది.
కాంగ్రెస్ పార్టీ కూడా సమస్యల పైన స్పందిస్తున్నప్పటికీ.. నిన్నటి దాకా ప్రధానంగా టిడిపి వర్సెస్ వైసిపిగా ఉంది. ఇప్పుడు జనసేన రంగంలోకి దిగింది. ప్రత్యేక హోదా పైన వెనక్కి తగ్గడంతో బీజేపీ కూడా అంతగా పుంజుకోవడం లేదని అంటున్నారు. దీంతో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ - జగన్లా.. మూడు ముక్కలాటగా మారిందని అంటున్నారు. చంద్రబాబు పాలన పైన జగన్ పోరాడుతుండగా.. ఇప్పుడు ఆయనకు పవన్ జత కలుస్తున్నారు.

జగన్ హెచ్చరికలు కొనసాగింపు..
ప్రజా సమస్యల పైన, ఎన్నికల సమయంలో టిడిపి ఇచ్చిన హామీల పైన వైసిపి అధినేత వైయస్ జగన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలో రెండు మూడేళ్లలో ఎన్నికలు రావొచ్చునని చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు కరుణిస్తే ఏడాదిలో ఎన్నికలు రావొచ్చునని అంటున్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఆయనను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలోను బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రధానంగా ఈ విషయంలో కూడా ఆయన చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. దీంతో టిడిపి నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.

జగన్కు పవన్ తోడు
ప్రజా సమస్యల పైన ఈ రెండేళ్ల పాటు జగన్ పోరాడారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సమస్యలపై స్పందించినా.. ఇప్పుడు వరుసగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న పవన్ తొలుత హోదా పైన దృష్టి సారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా అక్వా ఫుడ్ పార్కు పైన కూడా స్పందించారు.

పెట్టుబడులు విమర్శలు
కొత్త రాష్ట్రమైన నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశాల్లో పర్యటించారు. మార్చిలో 300 మంది లండన్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమవేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు టీవీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. రూ.200 కోట్లతో బ్రేక్స్ యూనిట్ స్థాపనకు మేలో సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రముఖ మొబైల్ ఉత్పత్తి కంపెనీ ఒప్పో ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పింది. చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. పారి పారిశ్రామిక అనుమతులను కూడా సులభతరం చేశారు. ఆన్లైన్లో పద్నాలుగు రోజుల్లో అనుమతులు, సింగిల్ విండో సిస్టం, మంచి రాయితీలతో ఆకర్షించే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ నుంచి అమరావతి తరలిన పాలన
ఈ ఏడాది ఏపీలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామం.. పాలన హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లడం. దాదాపు అన్ని శాఖలు అమరావతికి తరలి వెళ్లాయి. వేలాది ఉద్యోగులు బెజవాడ చేరుకున్నారు. అమరావతికి తరలిన ఉద్యోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటున్నారు. బెజవాడలో అద్దె ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంపై చంద్రబాబు బెజవాడ ప్రజలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

సచివాలయంపై సొంత నేతల అసహనం, విపక్షాల విసుర్లు
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించారు. ఇక్కడి నుంచి పాలన సాగిస్తున్నారు. అందరి మంత్రులకు చాంబర్లు కేటాయించారు. అయితే, ఇద్దరు ముగ్గురు మంత్రులు తమ చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. వాటిని మోడిఫై చేయించుకున్నారు. మరోవైపు రెండు మూడేళ్ల కోసం కోట్లాది రూపాయలు పెట్టి తాత్కాలిక సచివాలయం ఎందుకని, హైదరాబాదు నుంచే పాలన చేయవచ్చు కదా అని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

అభివృద్ధి వికేంద్రీకరణ
అమరావతిని ఏపీ రాజధానిగా చేయడంతో అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానిని ఫ్రీ జోన్గా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు గత రెండున్నరేళ్ల కాలంలో వినిపించిన రాయలసీమ రాష్ట్ర హెచ్చరిక అంశం ఈసారి తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం కూడా అభివృద్ధిని అమరావతికే పరిమితం చేయకుండా వికేంద్రీకరించనుంది. తద్వారా ఏ ప్రాంతంలో అసంతృప్తి రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తోంది.

అమరావతికి చిక్కులు
నవ్యాంధ్ర నేపథ్యంలో ప్రభుత్వం పాలనతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం పైన దృష్టి సారించింది. అమరావతిని 2029 నాటికి దేశంలో నెంబర్ వన్, 2050 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అయితే, అమరావతి నిర్మాణంలో ఎక్కడా అనుకున్న స్థాయిలో కదలిక లేదని భావిస్తున్నారు.

స్విస్ ఛాలెంజ్
అమరావతిని స్విస్ ఛాలెంజ్ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించేందుకు సిద్ధపడింది. అయితే దీనిపై వైసిపి నేత హైకోర్టుకు వెళ్లారు. దీంతో స్విస్ ఛాలెంజ్ విధానం పైన బాబు ప్రభుత్వం అప్పుడు యూ టర్న్ తీసుకుంది. రాజధాని నిర్మాణం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అప్పుడు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని నాడు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న వైసిపి.. ఈ విషయంలో విజయం సాధించిందని చెప్పవచ్చు.

పోలవరం ప్రాజెక్టు.. రగడ
పోలవరం పనుల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారానికి ఓ రోజు పోలవరం పైన సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 2018 కల్లా పోలవరం పనులు పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. ఓ వైపు ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా.. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేపడుతుందని, అవినీతి కోసమే దీనిని చేపడుతుందని వైసిపి విమర్శిస్తోంది. పోలవరంకు 90 శాతం కేంద్రం నిధులు ఇస్తోంది.

పాలనపై చంద్రబాబు 'కొత్త' ఆలోచన
పాలన సులభతరం చేసేందుకు చంద్రబాబుసరికొత్త ప్రయోగం చేసేందుకు ప్రణాళికలు చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కొత్త జిల్లాలకు బదులు పాలనపరమైన సౌలభ్యం కోసం ఏపీలో అరవై మినీ జిల్లాలుగా వికేంద్రీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఆలోచన ప్రకారం... రెవెన్యూ డివిజన్ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలి. కొత్తగా చేపడుతున్న ఈ పాలనా సంస్కరణలతో ఇప్పటి వరకు కేవలం రెవెన్యూ వ్యవహారాలకే పరిమితమైన ఆర్డీవోల పాత్ర మరింత విస్తృతం కావాలి. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఆర్డీవోలు రెవెన్యూ డివిజన్లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీలైనంతవరకూ అత్యధిక శాతం నిర్ణయాలు రెవెన్యూ డివిజన్లోనే జరగాలి. అలాగే పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్డీవో పరిధికి సమానంగా మారుస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులువుగా ఉంటుందని చంద్రబాబు భావించారట. అది ఇంకా రూపుదాల్చలేదు.












Click it and Unblock the Notifications