అనుమానంతో భార్యను పోడిచిన భర్త, ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా
అమరావతి: విజయవాడలోని పకీరుగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పోడిచాడు ఓ భర్త. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ లబ్బిపేటకు చెందిన నాగరాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కాగా భార్య రాజకుమారి(24)పై నాగరాజు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో అతని అనుమానం మరింతగా పెరిగి గురువారం భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్ధానికులు వెంటనే బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా
ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు మోసం చేసిన ఓ మహిళను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జడ్జిగా పని చేస్తున్నానంటూ నిరుద్యోగులను నమ్మించిన ఆకుల భవానీ అనే మహిళ.
జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఎంతకూ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆకుల భవానీని అరెస్ట్ చేశారు.
చిన్నారిని చితకబాదిన ట్యూషన్ టీచర్
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్ధినిని ట్యూషన్ టీచర్ చితకబాదడంతో తీవ్రంగా గాయపడింది ఆ చిన్నారి. ఈ సంఘటన జిల్లాలోని కొడమూరు బాలికల బీసీ హాస్టల్లో గురువారం జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తల్లిదండ్రులు పని కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్ధానిక బీసీ హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో రూ. 20 దొంగిలించిందనే కారణంలో ఆ బాలికను వాతలు తేలేటట్లు చితకబాదింది ట్యూషన్ టీచర్.
విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్నారిని చితకబాదిన ట్యూషన్ టీచర్పై చర్య తీసుకోవాలని స్ధానికులు డిమాండ్ చేశారు.