కూరగాయలు తెమ్మన్న భార్యపై కొడవలితో భర్త దాడి.. ధర్మవరంలో దారుణం
ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో భర్తలు భార్యలపైన దాడులు చేయడం కూడా నిత్యకృత్యంగా మారాయి. ఇక భార్యలు భర్తలపైన దాడులకు పాల్పడుతున్న ఘటనలు లేకపోలేదు. కూర సరిగ్గా వండలేదనో, చెప్పిన పని చేయలేదనో ఇలా చిన్నచిన్న విషయాలకే భార్య పై దాడులు చేస్తున్న భర్తలు ఇప్పుడు సమాజంలో ఆందోళనకరంగా తయారయ్యారు.
ఏ మాత్రం సహనం లేకుండా దాడులకు దిగి నేరాలకు పాల్పడుతున్న వారి తీరుతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. తాజాగా అటువంటి ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. కూరగాయలు తీసుకురామని చెప్పినందుకు భార్యపై భర్త కొడవలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం లోని శివానగర్ కు చెందిన లక్ష్మణస్వామి, రత్నమ్మ ఇద్దరు దంపతులు. మగ్గం పనులు చేసుకుంటూ వారి జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావాలని భర్తకు రత్నమ్మ తెలపడంతో డబ్బులిస్తే వెళతానని భర్త సమాధానమిచ్చాడు.
తన దగ్గర డబ్బులు లేవని రత్నమ్మ భర్తకు చెప్పింది. భర్తగా తన బాధ్యతను నిర్వర్తించాలని, కూరగాయలను తీసుకురావాలని ఆమె భర్తకు చెప్పడంతో భార్య భర్త ల వద్ద గొడవ జరిగింది. కనీసం కూరగాయలు తీసుకురావటానికి కూడా డబ్బులు లేవంటే ఎలా అంటూ భర్తతో వాగ్వాదానికి దిగటంతో వారి ఘర్షణ కాస్త చిలికి చిలికి గాలివాన అయింది. దీంతో భర్త కొడవలి తీసుకొని భార్య రత్నమ్మ పై దాడికి దిగాడు. క్షణికావేశంలో భార్యపై దాడి చేసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏం చేస్తున్నాడో విచక్షణ మరచి ప్రవర్తించాడు.
విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని భర్త లక్ష్మణ స్వామిని అడ్డుకున్నారు. భర్త చేసిన కొడవలి దాడిలో గాయపడిన రత్నమ్మను స్థానికులు అనంతపురం లోని వైద్య కళాశాలకు తరలించారు. అనంతపురంలో రత్నమ్మకు ప్రస్తుతం వైద్యం జరుగుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త లక్ష్మణ స్వామి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.