టెక్కీ ఘాతుకం: భార్య నచ్చలేదంటూ వేధింపులు, ఆత్మహత్య
గుంటూరు: విడాకులివ్వాలంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భర్త వేధించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని నెకరికల్లు మండలంలోని గుండ్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది.
మృతురాలి బంధువులు, పోలీసులు కథనం ప్రకారం గుండ్లపల్లికి చెందిన వెన్నా రాఘవరెడ్డి కుమార్తె అనంతలక్ష్మి (22)కి బెల్లంకొండ మండలం కందిపాడుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ కోటేరు రాజరాజేశ్వరరెడ్డితో మూడేళ్ల కిందట వివాహమైంది.
పెళ్లి అనంతరం రాజరాజేశ్వరరెడ్డి తన భార్యతో కలిసి బెంగుళూరులో కాపురాన్ని పెట్టారు. అయితే పెళ్లై మూడేళ్లు గడిచినా వీరికి సంతానం కలగలేదు. దీంతో రాజరాజేశ్వరరెడ్డి గత కొంతకాలంగా భార్య అనంతలక్ష్మిని వేధించడం మొదలు పెట్టాడు.
'నువ్వు నాకు నచ్చలేదు, నువ్వంటే ఇష్టం లేదు' అని వేధిస్తుండమే కాకుండా భార్యను విడాకులు ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేని అనంతలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో పదిరోజుల కిందట పుట్టింటికి వచ్చింది.
భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు సహజమని, సయోధ్య కుదేర్చేందుకు గ్రామపెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు బెల్లంకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సమయంలో తల్లిదండ్రులు సోమవారం పోలానికి వెళ్లిన సమయంలో అనంతలక్ష్మీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు రోదించారు.