బ్రతికి ఉండగానే భార్య సమాధి పక్కనే తనకు కూడా.. ఇంకా అవి కూడా !!
ప్రేమ అంటే కేవలం జీవితాంతం కలిసి ఉండటమే కాదు.. మరణానంతరం కూడా విడిపోకూడదనే తపన. అలాంటి అరుదైన ప్రేమకథ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో వెలుగు చూసింది. చిన్న చౌక్కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పి. రామ్మోహన్ రాజు తన భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నారు.
భార్య రాజ్యలక్ష్మి మరణించిన తర్వాత కూడా ఆమెను విడిచి ఉండలేనని భావించిన ఆయన.. ఆమె సమాధి పక్కనే తన కోసం ముందుగానే మరో సమాధిని నిర్మించుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ "ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో అరుదు" అంటూ ప్రశంసిస్తున్నారు.

1978లో మొదలైన అనుబంధం..
పి. రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతుల వివాహం 1978లో జరిగింది. ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం.. ఇలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈ దంపతులు ఒకరికి ఒకరు అండగా నిలిచారు. పి.ఎఫ్ శాఖలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు అనంతరం ఏపీ వైద్య విద్య శాఖలో సహాయ సంచాలకులుగా కూడా సేవలందించారు. వీరికి నలుగురు కుమార్తెలు. కుటుంబాన్ని ఎంతో ప్రేమగా నడిపించిన ఈ దంపతులు పరిసరాల్లో ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించుకున్నారు.
క్యాన్సర్తో భార్య మృతి..
అయితే 2011లో రాజ్యలక్ష్మి క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. భార్య మరణం రామ్మోహన్ రాజును తీవ్రంగా కుంగదీసింది. జీవితాంతం తనతో పాటు నడిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమవడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంత్యక్రియలను వారి నలుగురు కుమార్తెలే నిర్వహించారు. అయితే భార్యను కోల్పోయిన బాధ నుంచి రామ్మోహన్ రాజు పూర్తిగా బయటపడలేకపోయారు. "ఆమె లేకుండా జీవితం అసంపూర్ణం" అని తరచూ చెప్పేవారని సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.
భార్య సమాధి పక్కనే తనకోసం చోటు..
భార్యపై ఉన్న ప్రేమతో మరణానంతరం కూడా ఆమెకు దగ్గరగానే ఉండాలని రామ్మోహన్ రాజు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం స్మశానవాటిక నిర్వాహకులను స్వయంగా సంప్రదించి, రాజ్యలక్ష్మి సమాధి పక్కనే తనకు కూడా స్థలం కేటాయించాలని కోరారు. వారి అనుమతి లభించడంతో ఆయన ముందుగానే తన సమాధిని నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని తన కుమార్తెలకు కూడా వివరించి, తాను మరణించిన తర్వాత అక్కడే సమాధి చేయాలని కోరారు. తన చివరి కోరిక నెరవేర్చాలని కుటుంబ సభ్యులను భావోద్వేగంగా ఒప్పించినట్లు తెలిసింది.
అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే డబ్బు..
ఇక్కడితో ఆగని రామ్మోహన్ రాజు.. తన అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలని ముందుగానే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పెన్షన్ నుంచి రూ.4 లక్షలను కుమార్తెలకు ఇచ్చి, తన చివరి కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అంతేకాకుండా తన స్నేహితులకు కూడా రూ.50 వేల వరకు ముందుగానే అందజేసి, తన అంతిమయాత్రను ఘనంగా నిర్వహించాలని కోరినట్లు సమాచారం. జీవితంలో ప్రతి విషయంలోనూ ప్లానింగ్తో ఉండే ఆయన.. చివరి ప్రయాణాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
స్థానికులను కదిలిస్తున్న ప్రేమకథ..
రామ్మోహన్ రాజు చేసిన ఈ పని ఇప్పుడు కడప జిల్లాలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. "ఇలాంటి ప్రేమ సినిమాల్లో మాత్రమే చూస్తాం అనుకున్నాం.. నిజ జీవితంలో కూడా ఉందని ఆయన నిరూపించారు" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది ఆయనను "ప్రేమకు ప్రతీక", "అన్యోన్య దాంపత్యానికి నిర్వచనం" అంటూ కొనియాడుతున్నారు. భార్యను కోల్పోయినా, ఆమె జ్ఞాపకాలను హృదయంలో పెట్టుకుని జీవిస్తున్న రామ్మోహన్ రాజు కథ ఇప్పుడు ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications