మరోసారి హైదరాబాద్పై చంద్రబాబు, మరిచిపోతే మనుషులమేకాదు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పైన మరోసారి తనదైనరీతిలో వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పాలన పుణ్యమేనని ఆయన శుక్రవారం రాజమండ్రిలోని ఆనం కళాక్షేత్రంలో అన్నారు.
మామూలుగా ఉండే హైదరాబాదును నాలెడ్జ్ సిటీగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. ప్రపంచ దేశాల్లో సైబరాబాదుకు గుర్తింపు తీసుకు వచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గుర్తింపు ఉందన్నారు. చరిత్ర, సంప్రదాయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా మారుతామన్నారు.
మనకు భాష ముఖ్యమని, భాష ఉనికిని కాపాడుతుందని, భాషను మరిచిపోతే మనం మనుషులమే కాదన్నారు. కూచిపూడికి పూర్వ వైభవం తీసుకు రావాలన్నారు. ఊహించని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామన్నారు.

సత్య నాదెళ్ల తెలుగువాడని, మన రాష్ట్రంలో పుట్టి మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడన్నారు. ఐటీ రంగంలో భారత్ ప్రపంచంలోనే ముందు ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు కళలు, భాష, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. మనకు ఉన్న మౌలిక సదుపాయాలు ఎవరికీ లేవన్నారు.
మనకు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదన్నారు. కొందరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ సమయం, సందర్భం లేని సమయంలో వచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పని వల్లనే ఏపీకి నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు.
ఏపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని చెప్పేందుకే ఘనంగా గోదావరి పుష్కరాలు నిర్వహించామని చెప్పారు. మాతృభాషను మర్చిపోతే మనం మనుషులమే కాదన్నారు. ఏపిలోని వనరులతో సంపదను సృష్టిస్తామన్నారు.












Click it and Unblock the Notifications