హైదరాబాద్ మెట్రో రైలుకు మరో అవాంతరం?
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి మరో అవాంతరం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కారిడార్-1లోని అసెంబ్లీ ముందు పిల్లర్లపై కాకుండా మెట్రోరైలు కారిడార్ను అండర్గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాలు ఆటంకం కలిగిస్తున్నాయి.
అయితే, మెట్రోరైలు కారిడార్ 2పై ప్రతిపాదన స్థాయి నుంచే పాతబస్తీలోని వివిధ పార్టీల నాయకులు, వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, పాతబస్తీలో పట్టుకున్న మజ్లిస్ పార్టీల మధ్య కుదిరిన అవగాహన పొత్తు కారణంగా త్వరలో మజ్లిస్ పార్టీ కూడా కారిడార్ 2పై వ్యతిరేక గళం విప్పనున్నట్లు తెలిసింది.
నాగోల్ నుంచి శిల్పారామం వరకు సికిందరాబాద్, బేగంపేట, అమీర్పేట, మధురానగర్, యూసుఫ్గూడల మీదుగా ఏర్పాటు చేయనున్న కారిడార్ను ఆయా ప్రాంతాల్లో అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని కోరుతూ తాజాగా అక్కడి స్థానికులు ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు వినతిపత్రం సమర్పించారు.
అసెంబ్లీ ముందు, కారిడార్-2లోని సుల్తాన్బజార్, బడీచౌడీల్లో చారిత్రక కట్టడాలకు ఏ మాత్రం ముప్పు వాటిల్లకుండా, అవసరమైతే అండర్గ్రౌండ్ కారిడార్ను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో అది ఏ మేరకు సాధ్యసాధ్యమో తేల్చుకునేందుకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఇపుడు తాజాగా కారిడార్ 3 వ్యవహారం తెరపైకొచ్చింది. అలాగే సికిందరాబాద్ జెబిఎస్ నుంచి గౌలీగూడ సిబిఎస్ మీదుగా పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలకు సమీపంగా వెళ్తున్న ఈ కారిడార్పై కూడా త్వరలోనే మజ్లిస్ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.