హైదరాబాద్ అదిరేలా ప్రణాళికలు: కెటిఆర్ (పిక్సర్స్)
హైదరాబాద్: మహానగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో నెలకొన్న స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలను బట్టి అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రణాళికలను సిద్దం చేసేందుకు గాను సూచనలు, సలహాల కోసం శుక్రవారం బంజారాహిల్స్ ఆస్కీ క్యాంపస్లో ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీల ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్లు ఆయన ఈ కార్యక్రమంలో తెలిపారు.
మురికివాడల అభివృద్ధి
ముఖ్యంగా నగరంలో అరకొర వసతుల మధ్య నలిగిపోతున్న మురికివాడలను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే తొలుత 15 మురికివాడలను అభివృద్ధి చేయనున్నట్లు కెటి రామారావు తెలిపారు.
బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, స్మార్ట్ సిటీగా మార్చటంలో భాగంగా ఇప్పటిక రద్ధీగా ఉండే ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నళ్లకు టైమర్లను అమర్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు కెటిఆర్ వివరించారు. దీని ద్వారా ఒక రూట్లో వెళ్లే వాహనానికి వరుసగా వచ్చే సిగ్నల్స్ అన్ని కూడా గ్రీన్ పడే విధంగా సిగ్నల్స్ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీ అంటే..
స్మార్ట్ సిటీ అంటే కేవలం వౌలిక సదుపాయాలను మెరుగుపర్చటమే కాదని, ప్రజల అవసరాలకు తగిన విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది పనులు చేపడుతూ, అన్ని రకాల సమస్యలను పరిష్కరించి, సమస్య రహితమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు.
ప్రజా భద్రత కూడా..
హైదరాబాద్ను స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దేందుకు మహానగర పాలక సంస్థ కూడా ఎంతో చొరవ చూపుతుందని, ఇందులో భాగంగా ప్రజాభద్రత ప్రమాణాలను మెరుగుపర్చనున్నట్లు మంత్రి తెలిపారు.
అనంతరం కమిషనర్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ - నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలను అందుబాటులోకి తెచ్చి శాంతిభధ్రతల పరిరక్షణను మరింత మెరుగుపర్చంతో పాటు వివిధ విభాగాలకు చెందిన సేవలను కూడా ప్రజలకు మరింత వేగవంతంగా అందేలా కృషి చేస్తున్నామన్నారు.
నగరంలో సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా రౌండ్ ది క్లాక్ కామన్ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వర్క్షాప్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్థలు, కాలేజీల ప్రతినిధులు, పట్టణాభివృద్ధి నిపుణులు చేసిన సూచనలు, సలహాలిచ్చారు. వివరించారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నగరంలో జరగనున్న మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్లో కూడా స్మార్ట్సిటీ ప్రతిపాదనలపై వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.