హైదరాబాదీ మహిళా జర్నలిస్ట్ 'రైస్ బకెట్ చాలెంజ్'
హైదరాబాద్: ఎఏస్ఎల్ వ్యాధి పైన అవగాహనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్లో సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. హైదరాబాదుకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు రైస్ బకెట్ చాలెంజ్ను తెర పైకి తీసుకు వచ్చారు. హైదరాబాదుకు చెందిన మంజులత కళానిధి అనే మహిళ ఫేస్బుక్లో రైస్ బకెట్ చాలెంజ్ను ప్రారంభించారు.
ఐస్ బకెట్ చాలెంజ్ వ్యాధి పైన అవగాహన కల్పించే ఉద్దేశ్యం కోసం పుట్టుకు వచ్చింది కాగా.. నిరుపేదలకు కాస్త అన్నం పెట్టడమే లక్ష్యంగా రైస్ బకెట్ చాలెంజ్ వచ్చింది. ఈ చాలెంజ్లో భాగంగా ఓ బకెట్ నిండుగా ఉన్న బియ్యాన్ని కొనడం గానీ, లేక, ఆ బియ్యాన్ని వండి పేదలకు అన్నదానం గానీ చేయాల్సి ఉంటుంది.
రూ.100 విలువైన ఔషధాలు కూడా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి విరాళంగా ఇవ్వొచ్చట. దీనిపై మంజు తన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. మన కళ్ళెదుట నిలిచిన పేదరికం వంటి సమస్యలకు ఇది లోకల్, దేశీ పరిష్కారం అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
మంజులత ఆశయం పట్ల ఫేస్ బుక్ యూజర్లలో స్పందన బాగానే కనిపిస్తోంది. దీనిపై పలువురు స్పందించి, తమ తమ ప్రాంతాల్లో తోచిన మేర సాయం చేస్తున్నారట. రైస్ బకెట్ చాలెంజ్ పైన మంజులత ఫేస్బుక్ పేజీ ఆదివారం ప్రారంభమైంది. దీనికి చాలా లైక్స్ వస్తున్నాయి. అంతేకాదు, పలువురు బియ్యం, పప్పు, ఉప్పు.. ఇలా తమకు తోచిన సాయం చేస్తూ ఈ పేజీలో అప్ లోడ్ చేస్తున్నారు.