ఫేస్బుక్లో సవాళ్లు: కాలేజీ ఎదుట విద్యార్థిపై కత్తితో దాడి
హైదరాబాద్: ఫేస్బుక్ పోస్టుపై గొడవ ముదిరి కత్తితో దాడికి దారి తీసింది. ఓ విద్యార్థి తన బ్యాచ్మేట్పై కత్తితో దాడి చేశాడు. హైదరాబాదులోని నాంపల్లి దారుసలాంలో గల దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
బాధితుడు జునైద్ మొహియుద్దీన్ (19) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 19 ఏళ్ల నిందితుడు మాజ్ రబ్బానీపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంట ప్రాంతంలో కాలేజీ గేటు వద్ద కలుసుకున్నారు. ఈ సమయంలో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది.
ఫేస్బుక్లోనే ఇద్దరు విద్యార్థులు సవాళ్లు విసురుకున్నారు. తరగతులు ప్రారంభం కావడానికి ముందు కాలేజీ వెలుపల కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కూడా వాగ్వివాదానికి దిగారు. మధ్యలో రబ్బానీ తన సంచీలోని కత్తి తీసి బాదితుడిని పొడిచాడు. దాంతో అతనికి రక్తస్రావం జరిగింది.
స్థానికులు గుర్తించి బాదితుడిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. రబ్బానీ ముందే పథకం వేసుకుని కత్తిని తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. ఫేస్బుక్ కన్ఫెషన్ పేజీలోని కామెంట్ సెక్షన్లో ఇరువురు వాగ్వివాదానికి దిగారు. గొడవ ముదిరి ఇరువురు కూడా పబ్లిక్ డొమైన్లో తిట్టుకున్నారు. అది కాసేపు జరిగిన తర్వాత ఇరువురు కూడా కాలేజీ గేటు వద్ద కలుసుకోవాలని అనుకున్నారు.
జునైద్ ఫతే దర్వాజాకు చెందినవాడు కాగా, రబ్బానీ సంతోష్నగర్ నివాసి. ఇరువురు కూడా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.