బాబుపై కోపం లేదు: పురంధేశ్వరి, పార్టీల మధ్యే పొత్తులు
విజయవాడ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తనకు ఎలాంటి కోపం లేదని భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి అన్నారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంలేదు.. అప్పట్లో జరిగిన వ్యవహరాన్ని మాత్రమే తాను వ్యతిరేకించానని అన్నారు.
పొత్తులు ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, రెండు పార్టీల మధ్యేనని పురంధేశ్వరి చెప్పారు. రెండు పార్టీలకు న్యాయం జరిగితేనే పొత్తులుంటాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం టిడిపితో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పొత్తులపై బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్.. చంద్రబాబు నాయుడితో మాట్లాడుతున్నారని చెప్పారు.
గుజరాత్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అమలు చేయాలని పురంధేశ్వరి అన్నారు. కొత్త రాష్ట్రంలో వనరులు సక్రమంగా ఉపయోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు.
చంద్రబాబుతో ప్రకాశ్ జవదేకర్ భేటీ
హైదరాబాద్: బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్, అతని బృందంతోపాటు శనివారం ఉదయం టిడిపి అధినేత చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. ఇరు పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, తమ సీట్లను టిడిపికి కేటాయించొద్దని మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్, నల్గొండ జిల్లా సూర్యపేట నియోజక వర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరోవైపు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేట నియోజక వర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీ చేయరనే వార్తలు రావడంతోనే అంబర్పేట కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.