నాకేం కొమ్ములు రాలేదు: కెసిఆర్, రికార్డ్ డ్యాన్స్లే
హైదరాబాద్: ముఖ్యమంత్రిని అయిన తర్వాత తనకేమీ కొమ్ములు రాలేదని, తాను పాత కెసిఆర్నే అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్కు నివాళ్లు అర్పించి ఆ తర్వాత ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది రికార్డ్ డ్యాన్స్లు, ఇడ్లీసాంబర్లేనని ఆయన అన్నారు.
మంత్రి పదవి రాకపోవడం వల్లనే తాను పార్టీ పెట్టినట్లు ఇప్పటికీ సన్నాలుసు విమర్శిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. అందరికీ పదవులు రాకపోవచ్చు గానీ చాలా మందికి పదవులు ఇస్తానని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలను ఇక నుంచి ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో జయశంకర్ లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
జయశంకర్ పేర ఓ సంస్థను, సెంటర్ను, భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడే ఓ జిల్లాకు జయశంకర్ పేరు పెడ్తామని కూడా ఆయన చెప్పారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జయశంకర్ చివరి వరకూ పోరాటం చేశారని చెప్పారు. జయశంకర్ను ఎంత పొగిడినా తక్కువేనని ఆయన అన్నారు. చిన్న వయస్సు నుంచే జయశంకర్ తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు ఆయన తెలిపారు.
నడి సముద్రంలో నావలాగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకుని వచ్చారని ఆయన జయశంకర్ను ప్రశంసించారు. అన్యాయం, దోపిడీ, అణచివేత మితిమీరితే ఉద్యమం వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలని జయశంకర్ ఆశించారని ఆయన చెప్పారు.