రేస్లో లేను: చిరంజీవి 'స్పీడ్', సీమాంధ్ర సారథిగా ఛాన్స్
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తాను రేసులో ఉన్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఆయన తిరిగి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో చిరంజీవి విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవి గురించి విలేకరులు ప్రశ్నించారు. అన్నీ ఊహాగానాలేనని, మీడియా సృష్టి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే అందులో చేరతారా అని ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేశారు. ఓ వైపు విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఆయన అక్కడి నుండి వెళ్లిపోయి తన వాహనంలో కూర్చున్నారు. కెసిఆర్ ప్రయాణించిన విమానంలోనే చిరంజీవి వచ్చారు.
చిరంజీవి సారథిగా సీమాంధ్రలో ఎన్నికల ప్రచార కమిటీ?
విభజన నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం రెండు పిసిసిలు వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. రెండు వైపులా పలువురు ఆశావహులు ఉన్నారు. పిసిసిలతో పాటు ప్రచారం కమిటీలు, ఎన్నికల ప్రణాళిక కమిటీలను వెంటనే వేయనున్నట్లు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు చిరంజీవికి అప్పగించవచ్చంటున్నారు. ఎన్నికలు అయ్యే వరకు పిసిసి కమిటీలు కీలకం కావడంతో... రెండు ప్రాంతాలలోను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే వారు వాటి సారథ్య బాధ్యతలను తీసుకోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పిసిసి బాధ్యతల విషయంలో సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి ఉంటే ఓ రకంగా, రాష్ట్రపతి పాలన అయితే మరోరకంగా నిర్ణయం ఉండే అవకాశముంది. దాదాపు రాష్ట్రపతి పాలన ఖరారైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో పిసిసి పగ్గాలు ఓ సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారట. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానా రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, డి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications