బాబుకు సిగ్గుందా, మా ఎమ్మెల్యేలతో ఏం చేస్తారో అర్థం కావట్లేదు: జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జా ఉంటే అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసెంబ్లీ తీరు పైన విలేకరులతో మాట్లాడారు.
కోర్టు తీర్పు పట్టించుకోని స్థితిలో ఏపీ అసెంబ్లీ ఉందని రోజా అంశానికి సంబంధించిన ఇష్యూపై మండిపడ్డారహు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని, వారి పైన అనర్హత వేటు కూడా వేయడం లేదన్నారు.
ఇప్పటికే మూడు బడ్జెట్లు అయిపోయాయని, ఇక మిగిలింది రెండేనని చెప్పారు. పోలవరం అవకతవకలు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, ఎక్కువ రేట్లకు కరెంట్ కొనుగోలు జరుగుతున్న కుంభకోణం, రాజధాని ప్రాంత భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ అంశాలను సభలో ప్రస్తావించామని చెప్పారు.
నీకిది నాకది
బాబు ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారన్నారు. ఇసుకలో నీకింత నాకంత అని 2వేల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. రెండేళ్ల పాటు ఎడాపెడా దోచుకొని, ఇప్పుడు ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబుతున్నారన్నారు. మేం సభలో ఏం చెప్పామో కాగ్ కూడా వాటిని ధృవీకరించిందన్నారు.
సమైక్య ఏపీలో రూ.90వేలకు పైగా అప్పులు ఉంటే, ఇప్పుడు రూ.లక్షా 90వేలకు పైగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. రైతులకు భేషరతు రుణమాఫీ అని చెప్పిన బాబు మూడో వంతు కూడా చెల్లించలేదన్నారు. డ్వాక్రా మహిళలకు పంగనామాలు పెట్టారన్నారు.
ఇంటికో ఉద్యోగం అని చెప్పి కోటి 75 లక్షల కుటుంబాలను మోసం చేశారన్నారు. కేంద్రంలో మంత్రులు ఉన్నా నిధులు తీసుకు రాలేని పరిస్థితి అన్నారు. పైగా ఏపీని స్కాం ఆంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే గొంతు ప్రతిపక్షమేనని, ఆ ప్రతిపక్షం గొంతు కూడా నొక్కెస్తున్నారన్నారు.
ప్రతిపక్షం వాయిస్ మూసేస్తున్నారు
ప్రతిపక్షం వాయిస్ మూయించేందుకు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తిత్వం చంద్రబాబుది అన్నారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక, ప్రజలను మోసం చేసిన విశ్వసనీయత అన్నారు.
నిబంధలను, రూల్స్ను సభలో మారుస్తున్నారన్నారు. ప్రలోభ పెట్టి అనర్హత వేటు వేయని స్థితిని మనం చూస్తున్నామన్నారు. అవిశ్వాసం నోటీసు ఇస్తే 15 రోజుల సమయం తీసుకోవాలని, కానీ స్పీకర్ అదే రోజు తీసుకున్నారన్నారు.
అప్పటికప్పుడు చర్చకు తీసుకొని రూల్సును సస్పెండ్ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని కాపాడేందుకు అప్పటికప్పుడు చర్చకు పెట్టి డివిజన్ లేకుండా స్పీకర్ చేశారన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగు లేకుండా పాస్ చేయించారన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. ఇంతకంటే వారు ఓడిపోయారని చెప్పేందుకు ఏం నిదర్శనం కావాలన్నారు. స్పీకర్ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు.
కిరణ్ పైన అవిశ్వాసం పెడితే
కిరణ్ పైన అవిశ్వాసం పెడితే తమకు మద్దతిచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారని, ఆ పద్దెనిమిది మంది పైన అనర్హత వేటు వేస్తే తాము ఎన్నికలకు వెళ్లి 15 మందిని గెలిపించుకున్నామన్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే ఎన్నికలకు వెళ్తాడన్నారు.
విశ్వసనీయత లేకుంటే పెళ్లాం కూడా వెంటరాదన్నారు. చంద్రబాబుకు 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మరో పదిమందిని కొనుగోలు చేసి ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదన్నారు. హామీలిచ్చి అమలు చేశారా లేదా అన్నదే ప్రజలు చూస్తారని, వాటిని చూసే ఓట్లు వేస్తారన్నారు.
ఎమ్మెల్యేలను కొంటే జనాలు ఓటు వెయ్యరన్నారు. పది మంది వైసిపి ఎమ్మెల్యేలు ఓటింగులో పాల్గొనకపోయినప్పటికీ, అధికార పార్టీ వైపు మా ఎమ్మెల్యేలు కూర్చున్నప్పటికీ 67 మంది వైసిపి ఎమ్మెల్యేలు ఓటు వేశారని చెప్పడం విడ్డూరమన్నారు.