వేరే పార్టీలో చేరడమా: జేసీ దివాకర్ ఆసక్తికరం: డొనాల్డ్ ట్రంప్-కేసీఆర్ ఒక్కటే!
సంచలనాలకు మారుపేరుగా మారిన టిడిపి అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
విజయవాడ: సంచలనాలకు మారుపేరుగా మారిన టిడిపి అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఆయన రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన తాను అలా అనలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మీరు మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు.
తెలుగుదేశం పార్టీని వీడాలని, అలాగే మరో పార్టీలో చేరాలనే ఆలోచన తనకు లేదన్నారు. అసలు తాను త్వరలో రిటైర్ అవుదామనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

కాగా, బుధవారం నాడు ఆయన తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో ఆసక్తికర సంభాషణ చేశారు.
ఈటెలను చూసిన జేసీ.. 'అబ్బో ఈటెలకు ఎదురువెళ్లొద్దు. సామాన్యుడు కాదు. ఈటెలు దించుతాడు' అని సరదాగా అన్నారు. ఈటెల కూడా నవ్వుతూ ఎదురెళ్లి అభివాదం చేశారు. జేసీని ఆలింగనం చేసుకున్నారు.
తెలంగాణలో రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుకోకుండా అన్యాయం చేశారని, అడవుల పాలు చేశారని, మరో ఐదు పదేళ్లు తమకు కష్టాలు తప్పవని, విభజన తర్వాత తాము తెలంగాణతో కలిసి ఉంటే, తాగటానికి ఇన్ని నీళ్లు, తినటానికి ఇంత తిండి దొరికేదని జేసీ ఆన్నారు. కానీ కుదరలేదన్నారు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ రెడ్లే అడ్డుపడ్డారని, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిస్థితి దారుణం అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రెడ్ల వద్ద డబ్బుల్లేవని, ఉన్న డబ్బంతా గౌడ్లు, యాదవుల వద్ద ఉందని, తమ దగ్గర ఎకరా భూమి లక్ష కూడా పలుకదన్నారు. మీ నగరం కోట్లు పలుకుతుందన్నారు. నిజాయితీగా చెబుతున్నానని, ఏపీ సీఎం చంద్రబాబు తప్పుచేయడం చూడలేదని, తాను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పనితీరు చూశానని అన్నారు.
పైసలిస్తేనే ఫైలుపై సంతకం పెట్టే వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు తన డబ్బును వైట్ చేసుకుంటున్నారని వైసిపి అంటోందని, తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చూశానని, ఆయన తప్పు చేయడన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరిదీ ఒక్కటే మాట.. ఒకటే యవ్వారం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, ఆంధ్రవాళ్లను జాగో, భాగో అన్నారని, ట్రంప్ కూడా విదేశీయులను ఇలాగే అన్నాడని జేసీ సరదాగా అన్నారు.
మీడియాతోను బుధవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడారు. నోట్ల రద్దు సమస్య మార్చికల్లా సర్దుకుంటుందని, ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని, అంతా సెట్ అయ్యాక ఈ ఇబ్బందులు మరిచిపోతారన్నారు.












Click it and Unblock the Notifications