చిరంజీవిలా మంచోడ్నికాదు, అల్లు అరవింద్ నన్ను అలా చూశారు, ఏంచేయలేకపోయా: పవన్ సంచలనం
Recommended Video

రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై ఆయన స్పందించారు.
పరకాల ప్రభాకర్పై విమర్శలు చేశారు. విపక్షం అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఏమిటి అని వైసిపి అధినేత జగన్కు చెప్పారు. పీఆర్పీలో నిస్వార్థపరులు ఉంటే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు. తాను చిరంజీవిలా మంచివ్యక్తిని కాదని చెప్పారు. అలాగే కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలైన రాజకీయంటే సీఎం కావడం కాదు, ఊపిరాడకుండా చేయాలి
మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చునని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రి కావడమే రాజకీయ లక్ష్యం కాదన్నారు. సామాజిక మార్పు తేవడమే అసలైన రాజకీయం అని చెప్పారు. అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చునని, ఊపిరి ఆడకుండా చేయవచ్చునని చెప్పారు. హామీలను ఇచ్చి నెరవేర్చనప్పుడు ప్రజల తరఫున గళం విప్పుతానని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే అసలు రాజకీయం అన్నారు.

కుల రాజకీయాలపై పవన్ కళ్యాణ్, అమరావతి టూర్కు వెళ్తుంటే
కులాలు సామాజిక సత్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాజిక సత్యాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. అంబేడ్కర్ను నిజంగా గౌరవిస్తే కులాలను రాజకీయాల నుంచి తీసివేయాలన్నారు. కులాలను గౌరవిస్తాను కానీ కులాలను వెనుకేసుకు రానని, ఇదే జనసేన సిద్ధాంతమని చెప్పారు. కులం అనేది ఒక అంశం, ఒక భ్రమ అన్నారు. దేశంలో కుల రాజకీయాలు సర్వ సాధారణం అయ్యాయని చెప్పారు. తాను గతంలో రాజధాని పర్యటనకు వెళ్తుంటే తనచుట్టూ కాపు యువత ఉందని తప్పుడు కథనాలు రాశారన్నారు.

పీఆర్పీని విలీనం టైంలో నిస్సహాయుడిని, చరణ్లా నన్నూ నటుడిలా చూశారు
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో తాను నిస్సహాయుడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ సమయంలో అల్లు అరవింద్ తనను ఓ నటుడిలా చూశారని చెప్పారు. రామ్ చరణ్ తేజ, బన్నీ (అల్లు అర్జున్)లా తనను కూడా ఓ నటుడిలాగే చూశారని చెప్పారు. అందుకే తాను ఏం చేయలేని పరిస్థితి అన్నారు.

కాపును కాదు, భారతీయుడ్ని
తాను కాపును కాదని, భారతీయుడిని అని, అంతకంటే ముఖ్యమంగా మనిషిని అని చెప్పారు. తనను అభిమానించే వాళ్లు అన్ని కులాల్లో ఉన్నారని చెప్పారు. 2009లో కాపులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఎక్కువ సీట్లు ఇచ్చిందని చెప్పారు.

కుల నాయకుడిగా చెబితే ఊరుకునేది లేదు
తనను ఓ కులానికి అంటగట్టినా, ఓ కులనాయకుడిగా చిత్రీకరించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తనను ఎంతోమంది అభిమానిస్తారని, అందరి అభిమానం ఉందని చెప్పారు.

చిరంజీవిలా నేను మంచివాడిని కాదు
తన సోదరుడు చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నేను మాత్రం తన సోదరుడిలా మంచి వ్యక్తిని కాదని చెప్పారు. చిరంజీవిలో ఉన్నట్లు సహనం, మంచితనం నాలో లేవని చెప్పారు. ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో జనసేన నిర్మించానని చెప్పారు.

చిరంజీవికి కాపు ముద్ర వేశారు, మరి ఎందుకు ఓడిపోయారు
చిరంజీవికి కాపు ముద్ర వేశారని, మరి అలాంటప్పుడు 2009 ఎన్నికల్లో ఆయన పాలకొల్లు నుంచి ఎందుకు ఓడిపోయారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందరూ తమను అభిమానిస్తారని అభిప్రాయపడ్డారు.

కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విందు భోజనం పెడతానని ఆవకాయ బద్ద నాలుకకు రాసినట్లు ఉందని చంద్రబాబు ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. కులం అనేది కేవలం ఒక భ్రమ, ఒక అంశం మాత్రమే అన్నారు.












Click it and Unblock the Notifications