సీఎం జగన్ కొత్త నినాదం - విశాఖ రాజధాని చేద్దామంటే : రుణాలు రాకుండా అడ్డుగా - నో కాంప్రమైజ్..!!
జగన్ చేస్తున్న మంచి పనులతో ఎక్కడ పేరు వస్తుందో అనే కడుపు మంటతో దుష్టచతుష్ఠయం ప్రతీ విషయంలో అడ్డంకులు కలిగిస్తున్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అనకాపల్లిలో సీఎం జగన్ మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. ఈ దుష్టచతుష్ఠయం ఎన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా తాను మాత్రం రాజీ పడేదే లేదని స్పష్టం చేసారు. గతంలో ముఖ్యమంత్రి .. ఇప్పటి ముఖ్యమంత్రి చేస్తున్న మంచి ఏంటో మీరే ఆలోచన చేయాలని సూచించారు.

సీఎం జగన్ నోట ఆత్మగౌరవం నినాదం
నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టుకుంటే..ప్రతిపక్ష నేతగా ఉన్న తాను తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేుసకున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కోసం ఆ దుష్టచతుష్ఠయం నిత్యం ప్రభుత్వం పైన విమర్శలు చేయటమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్ కొత్త నినాదం వినిపించారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామంటే ఏ రకంగా అడ్డుకున్నదీ చూసారంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా రాయలసీమ ఆత్మగౌరవం కాపాడటం కోసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేద్దామని నిర్ణయిస్తే దానిని అడ్డుకున్నారంటూ వివరించారు.

రుణాలు రాకుండా అడ్డుకుంటున్నారు
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదిస్తే..అక్కడా అడ్డుపడేలా కోర్టులో కేసులు వేసారని వివరించారు. అందులోనూ పేదలకు అమరావతిలో స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని పేర్కొన్నారని చెప్పారు. ఏపీకి రుణాలు ఇవ్వకుండా ఆర్దిక సంస్థలు..బ్యాంకులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం సాయం చేస్తే జీర్ణించుకోలేరని ఫైర్ అయ్యారు. ఈ దుష్టచతుష్ఠయానికి కడుపు మంట ఎక్కువ అయిందని ఎద్దేవా చేసారు. విశాఖ జిల్లాలో లక్షా 30 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే..కోర్టుకు వెళ్లి ఇబ్బందులు కలిగించారని ఆరోపించారు. 16 నెలల పాటు అడ్డుకున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని చెప్పారు. మూడు ఆప్షన్లతో ఇళ్ల కేటాయింపులకు అవకాశం ఇచ్చామంటూ వివరించారు.

చంద్రబాబు - జగన్ పాలనలో గమనించండి
ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదనేది తమ ఉద్దేశమని స్పష్టం చేసారు. ఇళ్ల కోసం 55 వేల కోట్ల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మౌళిక వసతుల కోసం మరో 32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయిందని సీఎం వివరించారు. ఈ మొత్తం ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వం తీరు ..ఇప్పటికి మార్పు ఆలోచన చేయండని సీఎం సూచించారు. సీఎం పదవిలోని వ్యక్తులు మాత్రమే మారారని పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన మార్పు ఏంటో చూడాలన్నారు. లంచాలు - వివక్ష- మతం - ప్రాంతం - పార్టీ కూడా చూడకుండా ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత మంచి చేసేందుకు ప్రయత్నం కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications