రాజకీయ గొడవల్లో మహిళలను లాగొద్దు: చంద్రబాబుకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సూచన..!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం పట్ల జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితోనే మహిళలు ఈ ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు ట్యాగ్ చేసిన ట్వీట్కు సమాధానంగా..
ఈ నెల 10వ తేదీన చంద్రబాబు ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధురాలు పంచుమర్తి అనురాధ సహా కొందరు మహిళలను పోలీసులు నిర్బంధించిన వీడియో క్లిప్ను ఆయన ఈ ట్వీట్కు జోడించారు. దీన్ని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్.. రేఖాశర్మ దృష్టికి చేరింది. రెండు రోజుల తరువాత అంటే ఈ నెల 12వ తేదీన ఆమె చంద్రబాబు సమాధానాన్ని ఇచ్చారు. తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు.
@ncbn my team is already their to look into the matter. I only hope women are not been dragged in the political fight over the issue of capital. https://t.co/XY2zwmWRnF
— Rekha Sharma (@sharmarekha) January 11, 2020
రాజకీయ గొడవల్లో మహిళలను లాగొద్దంటూ..
రాజకీయపరమైన గొడవల్లో మహిళలను లాగబోరని తాను ఆశిస్తున్నట్లు రేఖాశర్మ అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆరా తీయడానికి ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధుల బృందం తన పర్యటనను ఆరంభించిందని గుర్తు చేశారు. అమరావతి పరిణామాలపై పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతికి సంబంధించిన గొడవల్లో మహిళలను లాగబోరని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.