జగన్ అంటే నాకెంతో ఇష్టం: గొడవ కాదంటూ రాంగోపాల్ వర్మ: మంత్రి పేర్ని నానితో భేటీ త్వరలో!
హైదరాబాద్/అమరావతి: ఏపీలో సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి నాని, దర్శకుడు రాంగోపాల్ వర్మకు మధ్య ట్వీట్ వార్ నడిచిన విషయం తెలిసిందే. రామ్గోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలకు పేర్ని నాని ట్విట్టర్ వేదికగా సమాధానం ఇవ్వడం.. నాని ట్వీట్కు మళ్లీ ప్రశ్నలు సంధించడం కొనసాగింది. చివరకు ఈ ట్వీట్టర్ వార్కు శుభం కార్డ్ వేశారు వర్మ.
ఏపీ సర్కారుతో గొడవ పడాలనుకోవడం లేదంటూ రాంగోపాల్ వర్మ
అయితే, తాజాగా, ట్విట్టర్లో.. ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని, పర్సనల్గా వైఎస్ జగన్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పుకొచ్చారు రాంగోపాల్ వర్మ. కేవలం తమ సమస్యలు తాము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో.. లేక మీరు(ఏపీ ప్రభుత్వం) సినీ పరిశ్రమ కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో మిస్ అండర్స్టాండింగ్ ఏర్పడి ఉండొచ్చని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
మంత్రి పేర్ని నానితో భేటీకి రాంగోపాల్ వర్మ రిక్వెస్ట్
'నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా సమస్యలను వివరిస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను' అంటూ ట్విట్టర్ వేదికగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి వెల్లడించారు. అంతకుముందు ఇతర నేతల్లా పరుష పదజాలంతో కాకుండా.. డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు వర్మ.
కలుద్దామంటూ రాంగోపాల్ వర్మకు పేర్ని నాని ట్వీట్
రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లపై స్పందించిన మంత్రి పేర్ని నాని, తప్పకుండా త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. పేర్ని నాని ట్వీట్పై స్పందించిన వర్మ.. నాని సానుకూలంగా స్పందించడంతో అనవసర వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు రాంగోపాల్ వర్మ.
పేర్ని నాని, ఆర్జీవీ భేటీపై ప్రాధాన్యత
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ.. ఏపీ మంత్రి పేర్ని నానిని ఎప్పుడు కలుస్తారు? సినీ పరిశ్రమల సమస్యలను ఏ మేరకు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. వీరి భేటీ, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. సామాన్యులకు కూడా వినోదాన్ని అందించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.