గుంటూరు డీలిమిటేషన్ వేళ.. తెరపై వైసీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..డీలిమిటేషన్ పై దృష్టి సారించింది. ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకుని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది జనసేన. రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికలు, నియోజకవర్గ హద్దులపై విశ్లేషణ చేస్తుందీ కమిటీ. తమ నివేదిక, సిఫార్సులను పార్టీ నాయకత్వానికి కమిటీ సమర్పిస్తుందని జనసేన ప్రకటించింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయభాను సహా ఈ బృందంలో పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరమీదికి వచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ విడుదల చేసిన డీలిమిటేషన్ (డివిజన్ల పునర్విభజన) అంశంపై జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం నిర్వహించింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొని డీలిమిటేషన్ ప్రక్రియపై నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు, డివిజన్ల భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యంతరాలను సమగ్రంగా సిద్ధం చేసి అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగేలా ఉన్న ప్రతిపాదనలపై పార్టీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేస్తామని తెలిపారు.
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్ర బాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కూడా నాయకులకు పలు సూచనలు చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక డివిజన్లపై సమగ్ర నివేదిక రూపొందించి అధికారులకు సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మూడు నియోజకవర్గాల అబ్జర్వర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications