చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్లలో.. జగన్ అంటేనే ఇష్టం: పోసాని
'దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఈ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం' అని పోసాని తనదైన శైలిలో బదులిచ్చారు.
హైదరాబాద్: గతంలో ప్రజారాజ్యం తరుపున ఎన్నికల బరిలో దిగి భంగపడ్డ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ఆ తర్వాత మళ్లీ సినిమాలపైనే ఫోకస్ చేశారు. అయితే అడపాదడపా రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ రాజకీయ చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్పై ఆయన మాట తూలడం తీవ్ర వివాదస్పదమైంది.
ఇదిలా ఉంటే, ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి తాజాగా ఆయనో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ సందర్బంగా.. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఎవరైతే బెటర్?.. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురిలో?' అన్నప్రశ్నకు 'జగన్' అని సమాధానం చెప్పేశారు పోసాని.
'దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఈ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం' అని తనదైన శైలిలో బదులిచ్చారు. ఈమధ్య ప్రధాని మోడీ పేరును పోసాని ఎక్కువగా ప్రస్తావిస్తుండటంతో సదరు యాంకర్ దీనికి సంబంధించి ఓ ప్రశ్న వేశారు. 'మోడీ జపం మీకు భయంతో వచ్చిందా? గుండెలోంచి వచ్చిందా? అని ప్రశ్నించారు.
దీనికి బదులిస్తూ.. 'పోసాని కృష్ణ మురళీకి ఈ రోజు ఏం కావాలి చెప్పండి? నేను బీజేపీ మెంబర్ కూడా కాదు' అన్నారు. ఇక బ్లాక్ మనీ ఏమైనా దాచుకున్నారా? అన్న ప్రశ్నకు.. 'ఉంటే మొత్తం తీసుకెళ్లిపోండి.. ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లకు ఎప్పుడో చెప్పాను. నేను వచ్చింది పేద కుటుంబం నుంచి. డబ్బుల్లేని స్థితిలో మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను, నా బిడ్డలు ఎంత సంతోషంగా బతకాలో అంత సంపాదించుకున్నాను' అని పోసాని చెప్పుకొచ్చారు.