నాన్న సీఎంగా ఉన్నప్పుడు.. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు: బాలకృష్ణ
ఎన్టీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో.. 'ఎప్పుడూ ఒక్క పని కూడా చేయించుకోలేదని, అసలు సెక్రటేరియట్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని' ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: రాజకీయం వారసత్వం అయిన చోట.. తండ్రి పవర్ ఆటోమేటిగ్గా తనయుడి చేతిలో దుర్వినియోగమవడం మన దేశ రాజకీయాల్లో అంతటా కనిపిస్తున్నదే. ఏపీ రాజకీయాల్లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా జగన్, లోకేష్ విషయాల్లో ఆ రెండు పార్టీల సభ్యులు పరస్పరం దీనిపై విమర్శలు చేసుకుంటూ ఉంటారు.
సరే వీళ్ల సంగతెలా ఉన్నా.. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు తానెలాంటి లాబీయింగ్ లు చేయలేదంటున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్టీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో.. 'ఎప్పుడూ ఒక్క పని కూడా చేయించుకోలేదని, అసలు సెక్రటేరియట్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని' ఆయన పేర్కొన్నారు.
బాలయ్యకు అభిమానుల షాక్: ఎందుకీ దూరం.. అసంతృప్తి రాజుకుందా?
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాల గురించి గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి.. వారికి ఉన్నత పదవులు దక్కేలా చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఆయన చెప్పారు.
అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనపై కూడా బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును రైతుల ఆత్మబంధువుగా పేర్కొన్న ఆయన.. రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబే అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్థాయిలో రాష్ట్రం కోసం శ్రమిస్తున్న సీఎం దేశంలో మరొకరు లేరని అన్నారు.
విదేశీ పర్యటనల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే వచ్చే పదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగాలన్నారు. దీంతో పరోక్షంగా తాను సీఎం సీటుకు దూరం అని బాలయ్య సంకేతాలిచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.