మోడీని కలవడం ఆశ్చర్యం: పవన్ కళ్యాణ్పై చిరంజీవి
విశాఖపట్నం: తన తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. శనివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లౌకికవాదని చెప్పారు. అలాంటి తన తమ్ముడు పవన్ మతతత్వ పార్టీ నాయకుడు మోడీని కలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలో గోద్రా నరమేధంలో ఇప్పటికీ మోడీ పాత్రపై ఆరోపణలున్నాయని చిరంజీవి చెప్పారు. ఈ విషయంపై పవన్ కు అవగాహన ఉందో లేదో తెలియదని ఆయన తెలిపారు. బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ముస్లిం సోదరులకు క్లారిటీ ఇచ్చారు, అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీ క్షమాపణలు చెప్పడం గానీ, క్లారిటీ ఇవ్వడం గానీ చేయలేదని చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లో ఎవర్ని ఎవరైనా కలవవచ్చని చిరంజీవి చెప్పారు. క్లారిటీ వచ్చాక మోడీని కలిస్తే బాగుండేదని చిరు అభిప్రాయపడ్డారు.
కుటుంబ కలహాలు, ప్రజారాజ్యం విలీనం చేయడం లాంటి పరిణామాలతోనే పవన్ కళ్యాణ్ దూరమై జనసేన పార్టీ పెట్టారా అని మీడియా ప్రశ్నించగా.. తాను పిఆర్పి పెట్టినప్పుడు యువరాజ్యం తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, తర్వాత తన నటనను కొనసాగిస్తానని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. పిఆర్పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తనతో ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. తామంతా కలిసే ఉంటామని, కలహాలు చోటు చేసుకుంటున్నాయనడం అవాస్తవమని చెప్పారు.
ఒకే కుటుంబంలో అందరి ఆలోచనలు, భావాలు ఒకేలా ఉండాలని ఎక్కడా లేదని చిరంజీవి చెప్పారు. పవన్ ఒక భావ జాలంతో ముందుకు వచ్చారు. అందుకు తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. తమ మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ తన కొడుకు లాంటి వాడని చిరంజీవి చెప్పారు. సామాజిక న్యాయం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో పిఆర్పిని విలీనం చేసినట్లు చిరంజీవి తెలిపారు.