రాష్ట్రాన్ని విభజించాలని సోనియాకు చెప్పా : ఉండవల్లి
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సమస్యకు రాష్ట్ర విభజనే పరిష్కారమని గతంలో ఓ సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే తన ప్రతిపాదనను విన్న సోనియా గాంధీ, అప్పుడు తనపై మండిపడ్డారని చెప్పారు. ఈ మేరకు ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీలో తనకు ఎదురుపడిన జిఓఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్కు ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ అధిష్ఠానం చేపట్టిన తీరుపై జైరాం రమేశ్ వద్ద ఉండవల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలకు తాను అనువాదకుడుగా, వారి కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నానని, అలాంటి తనను కూడా ఆయన సంప్రదించలేదని తప్పుబట్టారు. పేరులో జైరామ్ ఉంది కానీ, మిమ్మల్ని ఇప్పుడు జై రావణ్ అని సంబోధించాలని జైరాం రమేష్తో ఉండవల్లి అన్నారు. విభజన విషయంలో తప్పుడు సలహాలు ఇచ్చారని ఉండవల్లి ఆరోపించారు.
ఉండవల్లి వ్యాఖ్యలపై జైరాం రమేష్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి తదితరులతో చర్చించానని, ఉండవల్లితో చర్చించకపోవడం పొరపాటేనని అంగీకరించారు. కాగా తాను విభజనను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, తననడిగితే, ఇరు ప్రాంతాల ప్రజలు సంతోషపడేలా విభజన ప్రక్రియను సూచించేవాడినని ఉండవల్లి అన్నారు.
సోనియా గాంధీతో ప్రస్తుత సమస్యకు విభజనే పరిష్కారమని గతంలో ఓసారి ఆమెకు సూచించానని ఉండవల్లి తెలిపారు. అప్పుడు ఆమె తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వర్కింగ్ కమిటీ సభ్యుడుగా ఉండి ఇలా మాట్లాడటం సరికాదని, విభజన వల్ల చాలా ప్రమాదాలున్నాయని సోనియా గాంధీ తనకు తెలిపినట్లు ఉండవల్లి చెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల నుంచి సమస్యలు వస్తాయని, విభజనతో నదీజలాలు, ఉద్యోగాలు, విద్యుత్, రాజధాని వంటి అనేక సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నట్లు చెప్పారు.
అలాంటి సోనియా గాంధీకి కొంతమంది సలహాదారులు తప్పుడు సలహాలు ఇచ్చారని, వారిలో మీరు ప్రధాన వ్యక్తి అని ఉండవల్లి జైరాంను నిందించారు. ఇందుకు సమాధానంగా.. తానేమి సలహాలు ఇవ్వలేదని జైరాం చెప్పారు. వర్కింగ్ కమిటీ, జిఓఎం, కేబినెట్, కోర్ కమిటీ ఇలాంటి అనేక వ్యవస్థలు విభజనపై నిర్ణయం తీసుకున్నాయని జైరాం వివరించారు. మీరు వ్యతిరేకిస్తే ఇదంతా ఎందుకు జరుగుతుందని జైరాంను ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీసుకునే నిర్ణయాల ఫలితాలు వేరుగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయనకు ఉండవల్లి తెలిపారు.