పొత్తుపెట్టుకుంటే జనసేనకే!, అందుకే ఎంపీగా.. పవన్కు రుణపడి ఉంటాం: జేసీ తనయుడు
Recommended Video
అనంతపురం: వచ్చే 2019ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త ముఖాలు బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా తెర వెనుక రాజకీయాలు నడుపుతూ వస్తున్న యువ నాయకులు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగేందుకు తహతహలాడుతున్నారు.
తనయుల రాజకీయ ఆరంగ్రేటం కోసం నాయకులు చాలానే శ్రమిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే అధినేత చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ విషయంలో అందరి కన్నా ముందు ఉన్నట్లు కనిపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన తనయుడు బరిలో దిగుతాడని జేసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి దీనిపై స్పందించారు.
అసెంబ్లీకి పోటీ చేయను:
2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని, పార్లమెంట్కు పోటీ చేసి గెలిస్తేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చన్నది తన అభిమతమని జేసీ పవన్ రెడ్డి అన్నారు. ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేనందువల్లే పార్లమెంటు రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పొత్తు పెట్టుకుంటే జనసేనకే:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ.. ఆయన పార్టీపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తుందా?.. పొత్తుతో ఎన్నికల బరిలో దిగుతుందా?.. అన్నది తెలియదని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఈ ప్రాంతంలోని సీట్లు జనసేనకు వెళ్తాయని భావిస్తున్నట్లు పవన్ రెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ సెగ్మెంట్పై కాకుండా, పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు.
పరువు తీశారు!: పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ 'స్పోర్ట్స్ స్కామ్'?, వెలుగుచూసిన బాగోతం
పవన్కు రుణపడి ఉంటాం:
పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటామని పేర్కొనడం గమనార్హం. ఓవైపు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పవన్ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటే ఆయన తనయుడు మాత్రం రుణం పడి ఉంటామని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. హాయిగా సినిమాలు చేసుకోక పవన్ కళ్యాణ్ కు రాజకీయాలెందుకని ఇటీవలే జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పోటీ చేసినా తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఆ సమయంలో అన్నారు.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి బాబు పోటీ: లోక్సభకు బాలయ్య?
సాధ్యమేనా?:
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ రెడ్డిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తుంటే.. ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కూడా తన వారసుడిగా అస్మిత్రెడ్డిని రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే 2019ఎన్నికల్లో జేసీ తనయుల వారసుల ఎంట్రీ పక్కా. అయితే జేసీ బ్రదర్స్ స్థానంలో వారి తనయులకు టికెట్స్ ఇవ్వడానికి అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది చూడాలి.