దశాబ్దాలు: మురళీమోహన్, 'సినిమా' కుదరదని షాక్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతం తెలంగాణ రాజధాని హైదరాబాదులా అభివృద్ధి చెందేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్ శుక్రవారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఏపీ కొత్త రాజధానిగా విజయవాడను ప్రకటించడం సంతోషదాయకమన్నారు. రాజధాని ప్రకటనను ఏకగ్రీవంగా అంగీకరించడం శుభపరిణామం అన్నారు. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.
హైదరాబాదులా అభివృద్ధి సాధించేందుకు దశాబ్దాలు పడుతుందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుండి తరలించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి యాభై ఏళ్లు పట్టిందన్నారు.

ఇప్పటికిప్పుడు విశాఖ గానీ, రాజమండ్రి గాని వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, విశాఖను చిత్రపరిశ్రమకు కేంద్రంగా చేస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మురళీ మోహన్ మాత్రం తరలించడం ఇప్పటిక్పుపుడు సాధ్యం కాదని చెప్పడం గమనార్హం.
కేంద్రం స్వాగతిస్తుంది: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటనను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. విభజన చట్టానికి లోబడి కొత్త రాజధానికి సహకారం అందిస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షను కేంద్రం చూపబోదన్నారు.
ఏపీ, తెలంగాణల్లో తనిఖీలు పెంచండి: గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తనిఖీలు, నిఘా పెంచాలని గవర్నర్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల అంశంపై నరసింహన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల డీజీపీలు, సలహాదారులు పాల్గొన్నారు. భారత్లో ఆల్ ఖైదా ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications