కొత్త పార్టీ వద్దు, సమావేశాల తర్వాతే నిర్ణయం: ధర్మాన
హైదరాబాద్: పార్టీని మారే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, శాసనసభ సమావేశాల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. తనతోపాటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండటం, రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం ఈ రెండు అప్షన్లు తన ముందు ఉన్నాయని ధర్మాన తెలిపారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉండగా మరో ప్రాంతీయ పార్టీ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ చర్చించలేదని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ విషయం ఆయనే చెప్పాలని ధర్మాన అన్నారు.
సభ్యుల ఆందోళనతో వాయిదా పడిన సభలు
సోమవారం సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో మంగళవారానికి వాయిదా పడిన శాసనసభ సమావేశాలు ఈ రోజు కూడా వాయిదా పడుతూనే కొనసాగుతున్నాయి. సభ్యుల ఆందోళనతో శాసనసభ, శాసనమండలిలు సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి.
వాయిదా అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ సభ్యుల ఆందోళన కొనసాగడంతో మరోసారి అరగంటపాటు అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. శాసనమండలి సమావేశాల్లోనూ మండలి సభ్యులు ఆందోళన చేస్తూ పోడియంను చుట్టుముట్టడంతో మండలి గంటపాటు వాయిదా పడింది. కాగా తెలంగాణ ప్రాంత సభ్యులు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.