నా రక్తం ఇస్తా.. గర్భిణికి ఆపరేషన్ చేయండి:ఎమ్మెల్యే
బాపట్ల: గణపపరానికి చెందిన గర్భిణి అన్నామణి మంగళవారం బాపట్ల ఆసుపత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి తన బిడ్డను కాపాడాలని కోరింది. బాపట్ల ఆసుపత్రిలో బీ పాజిటివ్ రక్తం లేకపోవడంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు.
అదే సమయంలో ఆసుపత్రిలో అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన బాపట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘపతికి తన గోడును వెళ్లబోసుకుంది. ‘సార్.. నాకు ఆపరేషన్ చేయరంట.. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు' అంటూ నిండు గర్భిణి అన్నామణి ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట బోరున విలపించింది.
దీంతో స్పందించిన ఆయన ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి' అని చెప్పారని తెలుస్తోంది. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్ బ్యాంకు నుంచి అదే గ్రూపు రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టి. రామారెడ్డకి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు రాంబాబు బుధవారం రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.