పార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు
అనంతపురం: లోకసభలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరుకాబోనని ఆయన చేసిన ప్రకటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

సమర్థులున్నారుగా..
అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో రాజకీయాలు బాగా లేవన్న జేసీ.. టీడీపీ విప్ జారీ చేసినంత మాత్రాన ఏమీకాదని అన్నారు. పార్లమెంట్లో మాట్లాడేందుకు సమర్థులైన నాయకులు చాలామందే ఉన్నారని తెలిపారు.

హిందీ, ఇంగ్లీష్ రాదుగా..
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇద్దరికో, ముగ్గురికో మాట్లాడే అవకాశం వస్తుందని, అనుభవం ఉన్నవారు, ఇంగ్లిష్పై ప్రావీణ్యం ఉన్నవారు మాట్లాడతారని జేసీ చెప్పారు. తనకు అంతగా, హిందీ, ఇంగ్లీష్ రాదని చెప్పుకొచ్చారు.

పార్లమెంటుకు వెళ్లేది లేదు
అంతేగాక, ప్రస్తుత సమావేశాలు జరిగినన్ని రోజులూ తాను పార్లమెంట్కు వెళ్లనని జేసీ స్పష్టం చేశారు. మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి న్యాయం జరగదని అన్నారు. ఎవరిమీదా తనకు కోపం లేదన్న జేసీ ఆంధ్రప్రదేశ్కు మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మనసు మార్చుకుంటారా? లేక..
కాగా, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని బుధవారం కేంద్రంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. తమ అవిశ్వాసానికి మద్దతు తెలపాలంటూ టీడీపీ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో సొంతపార్టీ ఎంపీ జేసీ ఇలా వ్యవహరిస్తుండటంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. శుక్రవారం అవిశ్వాసంపై చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ మనసు మార్చుకుని పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారా? లేక తన మాట ప్రకారం రాకుండా ఉంటారో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications