బ్యాంకు పెడతా, వృధా! అమ్మని చూసి కన్నీళ్లు: బాబు
శ్రీకాకుళం: అవసరమైతే ఆడబిడ్డలకు ఓ బ్యాంకును పెట్టి, వారే రుణాలు ఇచ్చేలా చూస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబు ఓ సభలో మాట్లాడారు. మా ఆడబిడ్డలకు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేస్తారనే ఉద్దేశ్యంతోనే తాను అన్నింటిని మహిళలకు అప్పగించానన్నారు. 17 శాతం అక్షరాస్యత సాధించిన ఘనత డ్వాక్రా మహిళలకే దక్కిందన్నారు.
మహిళలు చదువుకుంటే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారన్నారు. ప్రతి మహిళ కూడా ఓ పారిశ్రామికవేత్త కావాలన్నారు. ప్రతి మహిళా సంఘం శక్తివంతమైన సంఘంగా కావాలన్నారు. ఆ రోజుల్లో తన తల్లిని చూశానని, వంట గదిలో తన తల్లి వంట చేయడానికి కష్టపడుతుంటే తనకు కన్నీళ్లు వచ్చేవన్నారు. అందుకే మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. లాభాలు ఆర్జించే మార్గాలు ఆలోచించకపోతే ఎన్ని రుణాలు ఇచ్చినా ప్రయోజనం లేదన్నారు.
ఉచిత రుణాలు ఇచ్చినప్పటికీ పది రూపాయలు సంపాదించే మార్గం చూడాలన్నారు. రాష్ట్రం దారుణంగా విడగొట్టారన్నారు. విభజనతో మనకు అప్పులు ఇచ్చారన్నారు. మనం కట్టుబట్టలతో వచ్చామన్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్నామన్నారు. ఓ కుటుంబం విడిపోతే.. ఎవరైనా కట్టుబట్టలతో బయటకు వస్తే ఎన్ని సమస్యలు ఉంటాయో, అలాంటి సమస్యలే మనం ఎదుర్కొంటున్నామన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు పార్టీ పద్దతి లేకుండా విభజన చేసిందన్నారు.
కానీ వారికి ఓట్లు, సీట్లు రాలేదన్నారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసేంత వరకు కష్టపడాలన్నారు. చెన్నైలో ఓ భవనం కూలిపోతే ఎక్కువమంది శ్రీకాకుళం వారే ఉండటం బాధాకరమన్నారు. శ్రీకాకుళం ప్రజలు ఇతర ప్రాంతాలకు కాకుండా.. ఇతర ప్రాంతాల వారే శ్రీకాకుళం వచ్చి ఉపాధి పొందేలా తాను అభివృద్ధి చేస్తానన్నారు. శ్రీకాకుళంలో వలసలు ఆపుతామన్నారు. తమ హయాంలో కరెంట్ బాగా ఇచ్చాని, కాంగ్రెసు పాలనలో అలా ఇవ్వలేకపోయారన్నారు.
శ్రీకాకుళంలో అక్షరాస్యత పెరిగినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏడు మిషన్లు పెట్టామన్నారు. పట్టణాలు ఎక్కువగా ఉంటే ఆదాయం ఎక్కువగా వస్తుందని, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పట్టణీకరణ తక్కువగా ఉందన్నారు. ఎక్కువ అదాయాలు సేవా రంగాల ద్వారా వస్తుందన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా రావాల్సిన అవసరముందన్నారు.
కోటీశ్వరులను మరింత కోటీశ్వరులను చేయడం అభివృద్ధి కాదని, పేదవారిని పైకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలో అందరిలోను పేదవారు ఉన్నారన్నారు. పేదవారు డ్వాక్రా గ్రూపుల్లో లేకుంటే చేర్పించాలని, అవసరమైతే కొత్త సంఘాలు పెట్టించాలని సూచించారు. పేదవారు ఆనందంగా ఉండేలా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. మహిళలు శారీరక కష్టంతో కాకుండా ఆలోచనతో పని చేయాలన్నారు.