వంద ఎలుకలు తిన్న పిల్లి, కెసిఆర్కు క్లాసు తీసుకుంటా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ వ్యవహార శైలి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
శాసనసభా విలువలను కాలరాసీన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ శిక్షణ తరగతులలో సభా సంప్రదాయాలపై నీతులు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్కు కావాలంటే తాను క్లాసులు తీసుకుంటానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో విలువలను దిగజార్చింది కేసీఆరేనని ఆయన అన్నారు.

అసెంబ్లీ కార్యదర్శి సదారాం, హైదరాబాద్ సీపీలు టీఆర్ఎస్ శిక్షణా తరగతులకు వెళ్లడం దారుణమని, వారిద్దరూ టీఆర్ఎస్ సభ్యులుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా పదవిలో కొనసాగిస్తున్నందుకు కేసీఆర్కు సదారాం ప్రభు భక్తి చూపిస్తున్నారని ఆరోపించారు. సదారాం, మహేందర్ రెడ్డిలను వెంటనే విధుల నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ శిక్షణా తరగతుల్లో రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలపై చర్చించలేదని, కేవలం కేసీఆర్ భజన కోసమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ఉల్లంఘన కిందకు వస్తాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం కోర్టులకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications