గీతదాటితే వేటే, బిజెపి పొత్తులపై ఆచితూచి, తెలంగాణలో ఇబ్బందులే: చంద్రబాబు
పార్టీలో ఇటీవల కాలంలో చోటుచేసుకొన్న పరిణామాలనేపథ్యంలో టిడిపి జాతీయ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు.
విశాఖపట్టణం: పార్టీలో ఇటీవల కాలంలో చోటుచేసుకొన్న పరిణామాలనేపథ్యంలో టిడిపి జాతీయ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. పార్టీ లక్ష్మణరేఖను దాటే వారిపై చర్యలు తప్పవన్నారు.ఈ సమస్యను పరిష్కరించనున్నట్టు చెప్పారు చంద్రబాబునాయుడు.
మహానాడు ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. పార్టీలో కొందరు నాయకులు వ్యవహరించిన తీరు కారణంగా పార్టీ నష్టపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ నాయకులు ఇష్టారీతిలో మాట్లాడినా చూసీచూడనట్టు వ్యవహరించినట్టు చెప్పారు. కానీ, రానున్నరోజుల్లో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించబోనని ఆయన హెచ్చరించారు.
కొందరు నాయకులు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల పార్టీకి తీవ్రంగా నష్టంచేస్తున్నారని బాబు అభిప్రాయపడ్డారు. అయితే ఈ నాయకులు తమ పద్దతిని మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు.
పార్టీకి నష్టం చేస్తే చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు పార్టీకి తీవ్రంగా నష్టం కల్గించింది.ఈ తీరు పట్ల బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం బలంగా ఉందని భావిస్తే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని ఆయన చెప్పారు. అయితే అనవసరంగా కొందరు చికాకులు తెస్తున్నారని పార్టీ నాయకులపై బాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కల్గించే వారు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తానని బాబు హెచ్చరించారు. పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీతో పాటు, రాష్ట్రం కూడ నష్టపోతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.
బిజెపి తీరుపై బహిరంగంగా మాట్లాడలేం
తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రాలో మరో రకంగా బిజెపి అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై బాబు స్పందించారు. ఈ విషయమై పార్టీలో చర్చించినట్టు చెప్పారు.అయితే ఈ విషయమై బహిరంగంగా అన్నీ చెప్పలేమన్నారాయన. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టిడిపితో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది. రానున్న ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉండబోదని ఆ పార్టీ కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతానికి స్నేహం కొనసాగుతోందని ప్రకటించారు. అయితే బిజెపితో పొత్తు వ్యవహారాలపై బాబు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
వచ్చే ఏడాది స్థానికసంస్థలకు ఎన్నికలను పూర్తి చేస్తాం
వచ్చే ఏడాదికి స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తిచేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు.జీవీఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్, మున్సిఫల్ ఎన్నికలన్నింటిని ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలోపుగా స్థానికసంస్థల ఎన్నికలన్నీ పూర్తిచేస్తామన్నారు. ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళనున్నట్టు చెప్పారు చంద్రబాబునాయుడు.
తెలంగాణలో ఇబ్బందులు
తెలంగాణలో పార్టీనేతలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నట్టు బాబు అంగీకరించారు.ఈ విషయమై ఆయితే వీలుచూసుకొని తెలంగాణలో కూడ పార్టీని బలోపేతం చేసేందుకు సమయాన్ని కేటాయించనున్నట్టు ఆయన చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకుగాను తెలంగాణ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని బాబు అభిప్రాయపడ్డారు.