సీఎం జగన్-అదానీ బ్రదర్స్ భేటీ... ఆ విషయం తనకు తెలియదన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అదానీ సోదరుల భేటీ హాట్ టాపిక్గా మారింది. గంగపట్నం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ గ్రూపుకు విక్రయించడంపై కోర్టులో విచారణ జరుగుతున్న వేళ... అదానీ సోదరులు జగన్ను కలవడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. రహస్యంగా జరిగినట్లు చెబుతున్న ఈ భేటీపై తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు.
సీఎం జగన్తో అదానీ సోదరుల బేటీ గురించి తనకు తెలియదన్నారు గౌతమ్ రెడ్డి.అదానీ గ్రూప్స్ నుంచి పెండింగ్ ప్రపోజల్స్ ఏమీ లేవన్నారు.గతంలో జరిగిన ఒప్పందాలే తప్ప... ప్రభుత్వానికి అదానీ గ్రూపుకు మధ్య కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలేమీ లేవన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల గురించి ప్రారంభిస్తూ.. త్వరలోనే ఇందుకోసం టెండర్లు పిలుస్తామన్నారు. 21 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు పెడుతామని... స్కిల్తో పాటు ఉపాధి మార్గాలు చూపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.రాష్ట్రంలోని ఐటీఐ,పాలిటెక్నిక్ కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు.
గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా విక్రయం వివాదం :
గంగవరం పోర్టులో ప్రభుత్వానికి చెందిన 10.4శాతం వాటాను రూ. 645 కోట్లకు అదానీ గ్రూపుకు విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తమ వాటాను అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.గంగవరం పోర్టు ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం... 30 ఏళ్లు మాత్రమే ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండాలి. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకే వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తమ వాటాను విక్రయించడంతో... ఈ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు లాయర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. ఈ తరుణంలో అదానీ సోదరులు జగన్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 89.6 శాతం వాటా ఉండేది. ఇందులో పెయిడప్ కేపిటల్ కింద 51.7 కోట్ల షేర్లు, డీవీఎస్ రాజుకు 30 కోట్ల షేర్లు ఉండేవి. ఒక్కో షేరుకు రూ.120 చొప్పున మొత్తం రూ.3,604 కోట్లకు అదానీ సంస్థ పోర్టును సొంతం చేసుకుంది. ఇదే పోర్టులో 31.5 శాతం వాటా ఉన్న దుబాయ్ కంపెనీ కూడా రూ.1,954 కోట్లకు తన వాటా విక్రయించింది. ఈ ఏడాది జూన్ 8న గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 10.4 శాతం అదానీ గ్రూపుకు రూ. 645 కోట్లకు అమ్మాలని నిర్ణయించారు.
విశాఖ స్టీల్ప్లాంట్ పక్కనే గంగవరం పోర్టు ఉంది.గంగవరం పోర్టును దక్కించుకున్న అదానీ గ్రూపు... విశాఖ స్టీల్ కంపెనీని కూడా దక్కించుకునే యోచనలో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దీంతో అదానీ గ్రూపు కూడా ఆ కంపెనీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.