చిక్కుల్లో బాబు: బీజేపీపై తగ్గేది లేదంటున్న కేశినేని, తల పగిలినా ఢీ కొడుతానని!..
విజయవాడ: బీజేపీపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీ మరిన్ని స్థానాలు గెలుచుకునేదన్న వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ విషయంలో సీఎం కోరితే వివరణ ఇవ్వడానికైనా తాను సిద్దమేనని ప్రకటించారు.
బుధవారం నాడు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. బీజేపీపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదన్నారు. తాను వాస్తవాలే మాట్లాడానని, తనకు ముఖ్యమంత్రే అధిష్టానం అని చెప్పుకొచ్చారు.

కార్యకర్తల్లో ప్రేరణ కోసమే:
తల పగిలినా కొండకు ఢీకొట్టేందుకు తాను సిద్దమేనని, అది తన కాన్ఫిడెన్స్ అని కేశినేని అన్నారు. కార్యకర్తల్లో ప్రేరణ కోసమే తాను బీజేపీ పొత్తుపై అలాంటి వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. తాను ఆ వ్యాఖ్యలు చేసింది పార్టీ సమావేశంలోనే అని, బహిరంగ సభలో కాదని గుర్తుచేశారు. ఇక పొత్తులు, నామినేటెడ్ పదవులకు సంబంధించిన వ్యవహారాన్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందన్నారు.

బీజేపీ సీరియస్:
కేశినేని వ్యాఖ్యలు ఇటు టీడీపీలో కలకలం రేపగా.. అటు బీజేపీకి ఆగ్రహం తెప్పించేవిగా మారాయి. కేశినేని వ్యాఖ్యలు బీజేపీని చులకన చేసేవిగా ఉండటంతో.. తమ పార్టీ సామర్థ్యాన్ని టీడీపీ తక్కువ అంచనా వేస్తోందని వారు భావిస్తున్నారు. నాని నోటివెంట వచ్చిన వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిగతమేనా? లేక వెనుక నుంచి టీడీపీయే ఆయన్ను ప్రోత్సహిస్తుందా? అన్న అనుమానాలు బీజేపీలో మొదలయ్యాయి.

చిక్కుల్లో పడ్డట్లే!:
కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా మెలిగితేనే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవడమైనా.. ప్రత్యేక ప్యాకేజీ నిధులైనా దక్కుతాయి. అలా కాకుండా సందర్భం వచ్చిన ప్రతీసారి బీజేపీపై టీడీపీ నేతలు ఎగిరెగిరి పడితే నష్టం ఆ పార్టీకే అన్న సంగతిని వారు మరిచిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఈ పరిస్థితులు ఇరకాటంలోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నేతలు బీజేపీపై ఆచితూచి స్పందించేలా చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే జరగాల్సిన డ్యామేజీ జరిగే సూచనలు లేకపోలేవు.

మోడీతో భేటీ జగన్ భేటీ తర్వాత!:
ప్రధాని మోడీతో జగన్ భేటీ తర్వాత టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా వారంతా తమ అభద్రతా భావాన్ని జగన్పై మాటల యుద్దంగా మలిచారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో మోడీపై విమర్శలు చేయడానికి కూడా వారు వెనుకాడలేదు. అమెరికా నుంచి చంద్రబాబు నేతలను మందలించడంతో సరిపోయింది గానీ లేదంటే మోడీపై కూడా ఘాటు వ్యాఖ్యలే చేసేవారు.
ఎటొచ్చి చంద్రబాబుకే ఈ పరిణామాలన్ని ఇబ్బందికరంగా మారాయి. బీజేపీతో చేకూరే మేలును అధినేత గుర్తించినంతగా ఆ పార్టీ నేతలు గుర్తించలేకపోతున్నారు. జనంలో ఆ పార్టీకి బలం లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన భావిస్తున్నారు.

2019 ఎన్నికలకు సమాయత్తం:
విజయవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో 2019ఎన్నికలకు సన్నద్దం కావాలంటూ టీడీపీ కార్యకర్తలకు కేశినేని నాని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అదే సమయంలో రాష్ట్ర పునర్విభజన తీరు గురించి కేశినేని ప్రస్తావించారు. విభజన జరిగిన తీరు బాధాకరమని, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా నిధులు రావాల్సి ఉందని అన్నారు.

చంద్రబాబుకు కానుకగా:
రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీకి వెన్నెముకగా ఉందని, వచ్చే 2019ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు గెలిచి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని కేశినేని ఆకాంక్షించారు. 2004 నుంచి 2014వరకు టీడీపీ అధికారంలో ఉంటే ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రం 16వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందని గుర్తుచేశారు. పార్టీ సమావేశంలోనే తాను టీడీపీ మెజారిటీ గురించి మాట్లాడానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications