నేను స్వార్థపరుడినే అయితే.. రాజధానిని అక్కడ పెట్టేవాడిని : చంద్రబాబు
వైసీపీ నేతలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని,త్వరలోనే వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ విధానాలు చూస్తుంటే.. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీ సమావేశాలకు అనుమతిచ్చే పోలీసులు.. టీడీపీ సమావేశాలకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపుకు కూడా హద్దులు ఉంటాయని, కానీ సీఎం జగన్ ఆ హద్దులు కూడా దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన అమరావతి పరిరక్షణ సభలో చంద్రబాబు మాట్లాడారు.
అవన్నీ ప్రభుత్వ హత్యలే..
తమ హయాంలో జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా.. సమావేశాలు పెట్టినా.. అడ్డుకోలేదని చంద్రబాబు అన్నారు. తాము గనుక జగన్ను అడ్డుకుని ఉంటే.. రాష్ట్రంలో తిరిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలని అన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ఇప్పటివరకు 37 మంది చనిపోయారని,అవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.
Recommended Video
ధర్నా శిబిరాన్ని తగలబెడుతారా..
తెనాలిలో చిల్లర రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదన్న చంద్రబాబు.. ఆఖరికి ధర్నా శిబిరాన్ని కూడా తగలబెడుతారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ తన హద్దులు దాటి ప్రజావేదికను కూల్చివేశారని విమర్శించారు. ప్రజల ఆస్తిని కూల్చడమేంటని ప్రశ్నించారు. తాను ఒక్క పిలుపునిస్తే రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు.
జగన్ తుగ్లక్లా తయారయ్యాడు..
సీఎం జగన్ తుగ్లక్లా తయారయ్యారని, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేవాళ్లు కూడా నీతులు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిని మార్చే అధికారం మీకు లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని అమరావతిలో ఉండాలని నిర్ణయించిందన్నారు. జాతీయ మీడియా కూడా అదే చెప్పిందన్నారు. కానీ వైసీపీ మాత్రం సామాజిక అవగాహన లేకుండా వ్యవహరిస్తోందన్నారు.
దానిపై విచారణ జరిపించండి..
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని.. అదే నిజమైతే విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. అమరావతిలో భూ అక్రమాలు జరిగితే విచారణ జరిపించాలన్నారు. బినామీల పేరుతో కొట్టేసే అలవాటు తనకు లేదన్నారు. విశాఖలో తాను ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే.. మహా నగరంగా తయారయ్యేదని.. కానీ అక్కడికి వచ్చిన కంపెనీలను బలవంతంగా వెనక్కి పంపించేశారని ఆరోపించారు.
స్వార్థపరుడినే అయితే.. రాజధాని తిరుపతిలో పెట్టేవాడిని..
తాను ఎక్కడా స్వార్థం చూసుకోలేదని.. ఒకవేళ తాను స్వార్థపరుడినే అయితే రాజధానిని తిరుపతిలో పెట్టేవాడినని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి తాను కృషి చేశానని చెప్పారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి.. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ బాధలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో 4వేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై రాయలసీమ ద్రోహిగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రాయలసీమకు ఎవరేం చేశారో తాను చర్చకు సిద్దమని ప్రకటించారు.