కొత్త బిచ్చగాళ్లు...రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు;వైసిపి వల్ల గెలవలేదు: మంత్రి ఆది
కడప: కొత్తగా వచ్చిన భిక్షగాళ్లు ఎవరైనా దేవగుడి కుటుంబాన్ని రెచ్చగొడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. జమ్మలమడుగులోని ఎత్తపువారి కాలనీలో నవనిర్మాణ దీక్షకు హాజరైన మంత్రి ఆదినారాయణరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Recommended Video
తమ పల్లెల్లో ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టడానికి పనికిరానివారు ఇప్పుడు తమ గ్రామాలకు వచ్చి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆది ఆరోపించారు. దేవగుడి చుట్టూ ఉన్న పది గ్రామాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏకపక్షమేనన్నారు. తన గెలుపుకు వైసిపి కారణం కాదన్నారు. 1996లో రాజశేఖర్రెడ్డిని మంచి మెజార్టీతో తామే గెలిపించామన్నారు.
ఆ గొడవను...మాపై రుద్దుతున్నారు
ఆదివారం జరిగిన పెద్దదండ్లూరులో జరిగిన గొడవతో తమకు సబంధం లేదని మంత్రి ఆదినారాయణ స్పష్టం చేశారు. ఈ గొడవకు సంబంధించి తమ కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ దాన్ని తమపై రుద్దుతున్నారన్నారు. ఈ గొడవను అడ్డుపెట్టుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తే తీవ్రంగా నష్టపోతారన్నారు. అంతేకాదు ఇప్పుడు తమని రెచ్చగొట్టాలని చూస్తే వచ్చే అన్ని ఎన్నికల్లో వారు ఇక్కడ ఎన్నికల్లో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేరని మంత్రి ఆది హెచ్చరించారు.
ఇక్కడ...ఎప్పుడూ ఏకపక్షమే...
దేవగుడి చుట్టూ ఉన్న 10 గ్రామాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏకపక్షమేనని...ఇలా పులివెందులలో కూడా ఏనాడూ ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదన్నారు. 1996లో వైఎస్ రాజశేఖర్రెడ్డి పెద్దముడియం మండలంలో చిన్నముడియం, ముద్దనూరు మండలంలోని పెనికలపాడులో అడుగు పెట్టలేకపోతే తాము వచ్చామన్నారు. అంతేకాదు 1996లో కడప జిల్లాలో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర ఉన్నప్పుడు కూడా రాజశేఖర్రెడ్డికి తమ గ్రామాల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించి గెలిపించామని చెప్పుకొచ్చారు.
ఎంతో...అభివృద్ది చేశా
తన హయాంలో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలను ఎంతో అభివృద్ధి చేశానని, అవేమీ తెలుసుకోకుండా...కనీస అవగాహన లేకుండా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను అభివృద్ది చేయలేదని ఏ నాయకుడైనా సరే అనేవారుంటే...ఆర్డీవో కార్యాలయం కానీ, గాంధీ సెంటర్ కానీ, వారి సొంత గ్రామాల్లో గాని ఎక్కడయినా సరే ఓపెన్ డిబెట్ చర్చకు సిద్ధమని మంత్రి ఆది ఛాలెంజ్ చేశారు.
అభివృద్ది...ఇలా చేశా...
నిడ్జిలో మొండి ట్యాంకు ఉంటే తాగు నీటి సదుపాయానికి అక్కరకు రాకుంటే తానే వాటర్ ట్యాంకు నిర్మించి మంచినీటి వసతి కల్పించానని చెప్పారు. తనను విమర్శించిన...ఇప్పుడు విమర్శిస్తున్న నాయకులు వారు ఏమి చేశారో...ఏమి అభివృద్ది చేశారో చెప్పేందుకు ముందుకు రావాలన్నారు. ఆస్పత్రిలో పేద రోగుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించానన్నారు. కుట్టుశిక్షణ, గ్యాస్ కనెక్షన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. అసలు తనను విమర్శించే అర్హత ఏ నాయకుడికి లేదన్నారు. అయితే మంత్రిగా ఉండి ఎన్నికల్లో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేరని ఆది హెచ్చరించడం వివాదాస్పదం అవుతోంది.